పెంట్లవెల్లి, జూన్ 20: చెంచు మహిళను ఇంట్లో నిర్బంధించి ముగ్గురు దుర్మార్గులు పదిరోజులుగా చిత్రహింసలు పెట్టారు. మహిళ శరీరంపై వాతలుపెట్టి.. పచ్చి మిరపకాయలు నూరి శరీరం, కండ్లు, మర్మంగాల్లో చల్లారు. నిప్పటించేందుకు డీజిల్ను కూడా ఒంటిపై పోశారు. సభ్యసమాజం తలదించుకొనే అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో బుధవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంచు మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాశవిక దాడిని ఖండించి, విచారం వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు.. మొలచింతలపల్లిలోని చెంచు భ్రమరాంబ కాలనీలో ఓ ఆదివాసీ దంపతులు నివసిస్తున్నారు. వారు తమకున్న మూడెకరాలను అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్, సలేశ్వరం, బండి శివుడు (ముగ్గురు బీసీ సామాజిక వర్గం)కు కౌలుకు ఇచ్చారు. కౌలుకు తీసుకున్న వారు ముందే డబ్బులు చెల్లించి ఆదివాసీతో అదే పొలంలో కొన్నేండ్లుగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పది రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. పొలంలో పనిచేయడం ఇష్టం లేక ఊరు విడిచి వెళ్లింది. తన భార్య కనిపించడంలేదంటూ భర్త ఆరాతీశాడు. భార్యకు తల్లిదండ్రులెవరూ లేకపోవడంతో ఊరూరూ తిరుగుతూ చివరికి చుక్కాయపల్లికి చేరుకున్నది. చుక్కాయపల్లిలో వెంకటేశ్ బంధువులు ఆమెను చూసి వారికి సమాచారమిచ్చారు. వెంకటేశ్, సలేశ్వరం, బండి శివుడు కలిసి ఆమెను చుక్కాయపల్లి నుంచి మొలచింతపల్లికి తీసుకొని వస్తూ.. దారి మధ్యలో చితకబాదారు. మొలచింతపల్లిలో బండి వెంకటేశ్ ఇంట్లో నిర్బంధించి వివస్త్రగా మార్చారు. పచ్చి మిరపకాయలను నూరి శరీరం, కండ్లు, మర్మంగాల్లో చల్లారు. నిప్పటించేందుకు డీజిల్ను ఒంటిపై పోశారు. ఆచూకీ తెలియని ఆమె భర్త గ్రామాల్లో వెదకసాగాడు. మహిళను ఇంట్లో నిర్బంధించిన విషయం బయటకు పొక్కడంతో గ్రామంలోని కొందరు మహిళలు నేషనల్ లేబర్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం 108లో కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు కొల్లాపూర్ ఎస్సై హృషికేష్ తెలిపారు. ఆదివాసీ సంఘం సభ్యుడు వెంకటస్వామి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
చెంచు మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాశవిక దాడిని ఖండించి, విచారం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి పాశవిక దాడులకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్కు ఫోన్ చేశారు. కేసు దర్యాప్తు పురోగతిపై మంత్రి ఆరా తీశారు.