Gangula Kamalakar | కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 3: ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేస్తే.. తెలంగాణ మరోసారి అధోగతి పాలవుతుందని, 50 ఏండ్ల కష్టాలను మళ్లీ కొనితెచ్చుకోవద్దని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి విస్తృత ప్రచారం చేపట్టారు. ఉదయం కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల, కొండాపూర్, ఐలోనిపల్లి గ్రామాల్లో ప్రచారం సాగించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో పట్టణ వ్యాపార, వర్తక సంఘం, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం ఆధ్వర్యాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.
సాయంత్రం నగరంలోని 14, 15, 16 డివిజన్లలో ఇంటింటి ప్రచారం సాగించారు. మంత్రి మాట్లాడుతూ.. సమైక్య పాలనలో గ్రామాలకు సరైన రోడ్లు కూడా లేవన్నారు. చెరువులన్నీ ఎండిపోయి కనిపించేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సాగునీరు, తాగునీరుకు ఎక్కడా ఇబ్బంది లేదని వివరించారు. ప్రస్తుత అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.