Rain Update | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి, మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల కొనసాగుతున్నదని వాతావరణశాఖ పేర్కొన్నది. అది ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా, 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అకడకడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపారు. బుధవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ తదితర జిల్లాల్లో వానలు కురవచ్చని వివరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.