హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి దొడ్డిదారిన కల్తీ మద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నదని, ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో అనేక మంది మరణానికి కారణమైన కల్తీ మద్యం కంపెనీని తెలంగాణకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. సోమవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అమ్మకాలకు కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకోలేదని ఇటీవల ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఒక పత్రికపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఆ పత్రిక మాత్రం భయపడలేదు. ఇప్పుడు జూపల్లి మాటలు అబద్ధమని తేలిపోయింది. ఆ శాఖ మంత్రి అయిన జూపల్లికి సమాచారం లేకుండానే సీఎం రేవంత్రెడ్డే నేరుగా డీలింగ్ చేశారా? సోం డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బీర్లను తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని సోం డిస్టలరీ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్చైంజ్కు అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఈ కంపెనీ అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్కు విరాళాలు ఇచ్చింది. 2019-20లో రూ.1.31 కోట్లు, 2013-14లో రూ.25 లక్షలు, 2018-19లో రూ.75 లక్షల విరాళం ఇచ్చింది’ అని వెల్లడించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్సింగ్ ఉండగా ఆయన సోం డిస్టిలరీ కార్యక్రమానికి వెళ్లి.. ‘మీరు డబ్బులు సంపాదించాలి, మీరు సంపాదిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
మీకు లక్ష్మీదేవత ఆశీస్సులు ఉండాలి’ అని అన్నారని గుర్తుచేశారు. ఈ విషయం ప్రముఖ మీడియా సంస్థల్లోనూ వచ్చిందని తెలిపారు. సోం డిస్టిలరీ సంస్థ మధ్యప్రదేశ్లో 24 మంది చనిపోవడానికి కారణమని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ డిస్టిలరీని సీజ్ చేసిందని, గుజరాత్లో ఇదే కంపెనీ కల్తీ మద్యం తాగి 65 మంది చనిపోయారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి కంపెనీకి అనుమతి ఇచ్చి అక్రమ మద్యానికి తలుపులు తెరిచిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం, గుడుంబా ఉండకుండా కేసీఆర్ హయాంలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారని, కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ సర్కారు అక్రమ మద్యం తయారు చేస్తున్న సంస్థను రాష్ర్టానికి తీసుకు వస్తున్నదని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తయారీలో సోం డిస్టిలరీ ముందు ఉంటుందని, అక్రమ సంపాదనే ధ్యేయంగా కాంగ్రెస్ ఇలాంటి పనులకు దిగజారుతున్నదని ఆరోపించారు. ఈ అంశంపై ఉరుకునేది లేదని, ప్రజల ప్రాణాలకు హాని ఉన్నదని, అలా జరగకుండా బోగస్ కంపెనీలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది రావొద్దనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రి జూపల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.