మహబూబ్నగర్, జూన్ 29 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో హంతకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ ఎస్పీ జానకి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన వడ్డె ఖాసీం కూలి పనులు చేస్తూ మహబూబ్నగర్ బస్టాండ్, ఫుట్పాత్ల మీద ఉండేవాడు.
మహబూబ్నగర్ మండలం గాజులపేటకు చెందిన దాసరి లక్ష్మి(33) మే 23న టీడీగుట్ట ప్రాంతంలో కూలిపనుల కోసం రాగా, డబ్బు ఎర చూపి అమిస్తాపూర్ శివారుకు తీసుకెళ్లి బ్లేడ్తో గొంతుకోసి హత్య చేసి, కాళ్లపట్టీలు తీసుకుని పరారయ్యాడు. భూత్పూర్ సీఐ రామృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో నిందితుడి ఐడీకార్డు దొరకడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వైన్షాపు నుంచి దాసరి లక్ష్మి, ఖాసీం రావడం గుర్తించారు.
శనివారం టీడీగుట్ట బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, ఆరుగురిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్యకు గురైన వారిలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంనకు చెందిన మల్లేశ్ పాలమూరులో పనికోసం రాగా గత ఏడాది ఖాసిం పరిచయం చేసుకుని, రూ.3వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమని కోరగా ముఖంపై రాళ్లతో కొట్టి చంపాడు. జమిస్తాపూర్కు చెందిన విద్యువాత్ సీత మ్మ(44), మరో మహిళను మన్యంకొండ గుడి సమీపంలోని గుట్టలో హత్య చేశాడు.
వనపర్తి జిల్లా రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరిని, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి పీఎస్ పరిధిలో మరో మహిళను హత్య చేశాడు. కేసును ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణ, మూసాపేట పీఎస్ పీసీ జమీర్, అడ్డాకల్ పీఎస్ నవీన్ కుమార్ను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు , డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ సీఐ రామకృష్ణ ఉన్నారు.