Rain Update | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మ లాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబనగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం అతి భారీ వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు.