Congress | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఏరు దాటి తెప్ప తగలేసిన’ చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలకు కాంగ్రెస్ ప్రభుత్వం గండికొట్టింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. నిరుద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. వారి డిమాండ్లు పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పని చేయాలి అని షరతులు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల ఊసే ఎత్తడం లేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నది. అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను అమలు చేయడంలో వెనకాడుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. నిరుద్యోగుల హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభు త్వం ఎప్పుడూ సిద్ధంగా లేదని తెలుస్తుంది. హామీల అమలు ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన వారు అక్కడక్కడా స్పష్టం చేస్తున్నారు.
నోటిఫికేషన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగుల డిమాండ్ల ప్రకారం గ్రూప్-1 మెయిన్స్లో 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం కుండబద్ధలు కొడుతుంది. గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్లో ప్రకటించినట్టుగా 1:50 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను మెయిన్కు ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ సర్కారు స్పష్టంచేస్తున్నది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కూడా నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు పోతామని తేల్చిచెప్తున్నది. ఇక గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 వరకు పోస్టులు పెంచుతామని ఇచ్చిన హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్లో 25 వేల వరకు టీచర్ పోస్టులు పెంచి, నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని నిరుద్యోగులు కలిసి వినతిపత్రం అందజేసినా చేదు అనుభవమే ఎదురైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. ప్రస్తుతం టీజీపీఎస్సీ నిర్వహించనున్న పరీక్షలకు హాజరు కావాలి అంటూ చిన్నారెడ్డి ఉచిత సలహాలిచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ఒక నిరుద్యోగ అభ్యర్థిని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి కాళ్లపై మీద పడి వేడుకున్న వారికి పరాభవమే మిగిలింది. అయితే ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగుల డిమాండ్ పరిష్కరిస్తే.. లీగల్ సమస్యలు ఎదురవుతాయని, దాని వల్ల సకాలంలో పూర్తి కావాల్సిన ఉద్యోగాల భర్తీలో ఆలస్యం చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి చెప్పడంతో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గ్రూప్-4లో 25 వేల పోస్టులు..
ప్రస్తుత గ్రూప్-4 నోటిఫికేషన్లో చూపిన 8,039 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. కాని ఆయా శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కిస్తే గ్రూప్-4 క్యాటగిరీ కింద 25,000 పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు లెక్కలు చెప్తున్నా రు. అందుకు 33 జిల్లాలు ఏర్పాటు కావడమే కారణమని పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రస్తుత గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సిన 25 వేల పోస్టులపై కూడా కాంగ్రె స్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లే దు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకా రం రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీల ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తి విధానం అమలు చేసి, గ్రూప్-2, గ్రూప్-3లో అదనపు పోస్టులు పెంచాలని కోరుతున్నారు.