KTR | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో చేరిన తర్వాత సీనియర్ నేత కే కేశవరావు (కేకే) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరి, పార్టీ ఫిరాయించిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేల సంగతేంటని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడే రాహుల్గాంధీ, దానిని నిలబెట్టడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మ్యానిఫెస్టోకు విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న రాహుల్గాంధీ.. ఫిరాయింపులను అరికడతామంటూ చెప్తున్న మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోపై రాహుల్కు ఏమాత్రం నమ్మకం ఉన్నా కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెల్లారే సీనియర్ నేత కే కేశవరావు (కేకే) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను ఆదర్శనేతనని చెప్పకనే చెప్పారు. చట్టంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను వీడి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ సంగతేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనర్హత వేటు పడడానికి ముందే వీరితోనూ పార్టీ రాజీనామా చేయిస్తుందా? లేదా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. తమది జాతీయ పార్టీ అని, రాష్ర్టానికో విధానం ఉండదని గొప్పలకు పోయే కాంగ్రెస్ పార్టీ కేకే బాటలోనే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను నడిపిస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని చూసుకుని కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేల విషయంలోనూ ఇలాగే ముందుకెళ్లి ప్రజాతీర్పును కోరాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణులు కూడా ఓన్ చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడే సాహసం కాంగ్రెస్ చేస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, వారిపై అనర్హత వేటు పడేవరకు పోరాడాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నది.
పార్టీలో చేరిన మర్నాడే కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేల విషయంలో అలా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తున్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, మూడింటి రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని, వారంతా అప్పుడు చట్టబద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవుతారని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నమ్మబలికింది. ఆ నమ్మకంతోనే పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి కేకే వ్యవహారంతో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తమపై అనర్హత వేటు పడితే పరిస్థితి ఏంటోనన్న ఆందోళన ఆ ఆరుగురు ఎమ్మెల్యేల్లో నెలకొన్నది. పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి ఒకలా ఉంటే, మరోవైపు కాంగ్రెస్లో చేరిన కేకేను ఎవరు రాజీనామా చేయమన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమపై ఒకవేళ వేటు పడితే ఇటు ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు అటు సొంత నియోజకవర్గంలోనూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.