హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్మీడియా హ్యాండిల్స్ గత ప్రభుత్వాలు నిక్షిప్తం చేసిన డిజిటల్ సమాచారం మొత్తం ప్రజల ఆస్తి అని, దానిని ఉద్దేశపూర్వకంగా తొలగించడం హేయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతున్నదని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను కూడా తీసేశారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
మొదట్లో మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారని, కొన్ని నెలలుగా మరింత సమాచారం కనబడకుండా పోతుండటంతో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనే అనుమానాలొస్తున్నాయని పేర్కొన్నారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల హస్తం ఉన్నదనే సందేహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసేందుకు చేస్తున్న హేయమైన చర్యను ఆపాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వాలకు సంబంధించిన మొత్తం డిజిటల్ కంటెంట్ను భద్రపర్చాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యం భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఎస్ను కోరారు. రాష్ట్ర చరిత్ర, ప్రాముఖ్యతకు సంబంధించిన అన్ని ఆధారాలు, సమాచారం, డిజిటల్ కంటెంట్ను కాపాడాల్సిన బాధ్యత సీఎస్పై ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సీఎస్కు లేఖ రాయాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న (జూన్ 2014-డిసెంబర్ 2023) సమయంలోని వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో విలువైన సమాచారాన్ని తొలగించారని వివరించారు.
భవిష్యత్తు తరాలు క్షమించవు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించిన వైబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వివరాలను లేఖలో కేటీఆర్ జత చేశారు. పబ్లిక్డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యం భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా సమగ్రమైన సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు.
Ktr
తొలగించిన వెబ్సైట్ల వివరాలివీ…
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి జనవరి నుంచి తొలగించిన వైబ్ సైట్లు, పోర్టల్స్ వివరాలను లేఖవెంట అందజేశారు. వాటి వివలాలిలా ఉన్నాయి.