హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రొటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిపై నిరసన తెలిపినందుకు ఎమ్మెల్యేపైనే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేయటం అక్రమమని బుధవారం ‘ఎక్స్’లో మండిపడ్డారు. పోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాపాలన అంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్రెడ్డి చేసిన నేరమా? నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్య, సౌకర్యాలు, తరగతి గదుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపై మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా? ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేమిటి? డీఈవో కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జడ్పీ సమావేశంలో లేవనెత్తారు.
స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికీ కౌశిక్రెడ్డికి హకు లేదా? జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవటంతో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధికే నిరసన తెలిపే హకు లేదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. కౌశిక్రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ఎమ్మెల్యేగా కౌశిక్రెడ్డి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాలను బయటికి తీస్తున్నందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని విమర్శించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. బీఆర్ఎస్ ప్రజాగొంతుకగా ఉంటుందని స్పష్టంచేశారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.
సమస్యలపై సమీక్ష నిర్వహించే అధికారం లేదా?: సబితాఇంద్రారెడ్డి
ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకపోవడమే నేరమా? అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు తమ నియోజకవర్గంలోని సమస్యలపై సమీక్ష నిర్వహించే అధికారం లేదా? అని నిలదీశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై అక్రమ కేసును బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
‘ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవటంతో.. నిరసన వ్యక్తం చేసే హక్కు శాసనసభ్యులకు లేదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ముఖ్యమంత్రీ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అక్రమ కేసులతో ప్రతిపక్షాల నోరును మూసేయించేందుకు జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: హరీశ్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు అక్రమకేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినందుకు గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడబోదని మరోసారి స్పష్టం చేస్తున్నా.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్రెడ్డి చేసిన తప్పా? ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజాపాలన? కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. ప్రతీకార చర్యలు, అక్రమ కేసులను చట్టపరంగా ఎదురొంటాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం’ అని వెల్లడించారు.