KTR | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు వైఫల్యం వల్లనే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవేదన వ్యక్తంచేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతున్నదని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న పల్లె యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.