KTR | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి, మొదటి ఏడాదిలో రెండు లక్షల పోస్టులు నింపుతామన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ను గురువారం గ్రూప్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కలిశారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైనందున ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమకు అండగా నిలడాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని విస్మరిస్తున్నందున తమతోపాటు ప్రజల తరఫున పోరాడాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు తమ సమస్యపై నిరుద్యోగులు కేటీఆర్కు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎన్నో హామీ లు ఇచ్చిందని చెప్పారు. వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఒక పద్ధతి ప్రకారం నియామకాలు చేపడతామని చెప్పిందని గుర్తుచేశారు.
వివిధ నోటిఫికేషన్ల విడుదలపై జాబ్ క్యాలెండర్ పేరిట తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో నాడు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. నాటి అడ్వర్టైజ్మెంట్లను కేటీఆర్ మీడియాకు చూపించారు. గ్రూప్-1కు ఫిబ్రవరి 1, గ్రూప్-2, 3లకు ఏప్రిల్ -1, గ్రూప్-4కు జూన్ ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజినీర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ప్రజారోగ్యశాఖ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీలోని ఉద్యోగాల భర్తీకి మే 1న, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్, టౌన్ప్లానింగ్ ఆఫీసర్స్, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి జూన్ 1న, ట్రాన్స్కో, ఎక్సైజ్, పోలీస్ కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ మా ర్చి 1, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నోటిఫికేషన్ను ఏప్రిల్ 1న, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీలు, మండలస్థాయి సాం కేతిక సిబ్బంది పోస్టుల భర్తీకి జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిందని తెలిపారు. మెగా డీఎస్సీ అంటూ పది నోటిఫికేషన్లు ఇస్తామన్న మాటలను కాంగ్రెస్ నేతలు నీటి మూటలుగా మార్చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
గ్రూప్-1 మెయిన్స్కి 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో పిలవాలని కేటీఆర్ డిమాం డ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయం గా ఇప్పటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార శాసనసభలో గ్రూప్-1 అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో తీసుకోవాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. నాడు మీరే డిమాండ్ చేసి ఇవాళ సాంకేతిక కారణాలను సాకులుగా చూపి తప్పించుకోవడం తగదని హితవుపలికారు. పరీక్షలు వరుసగా ఉన్నందున, అభ్యర్థులకు సరిపడా వ్యవధి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని స్పష్టంచేశారు. లేనిపక్షంలో ఏ నిరుద్యోగులైతే అధికారంలోకి తీసుకొచ్చారలో వారే కథనాయకులై కాంగ్రెస్ పార్టీపై తిరగబడతారని హెచ్చరించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువతకు మద్దతుగా బీఆర్ఎస్ తరఫున శాసనసభలో, శాసనమండలి, రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేసీఆర్ నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే మద్ద తు కూడగట్టారో.. నిరుద్యోగులు కూడా తమ హక్కుల కోసం ప్రతి ఎమ్మెల్యేను కలిసి మద్ద తు కూడగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు బా ల్క సుమన్, గెల్లు శ్రీనివాస్యాదవ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పోటీ పరీక్షల అభ్యర్థులు సిం ధు, మహేంద్ర, మిత్ర పాల్గొన్నారు.
గ్రూప్-2లో 2వేల ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్-3లో వేలాది ఉద్యోగాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాడు ప్రకటించినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ చేయలేకపోయారు.. అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని బీరాలు ప లికారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో రెం డే పనులు చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1లో 503 పో స్టులకు మరో 60 పోస్టులు కలిపారని, డీఎస్సీలో తాము ఇచ్చిన 5,089 పోస్టులకు మరో 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062కు నోటిఫికేషన్ వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన పోస్టులు 6,033 మాత్రమేనని, వీటి నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని తెలిపారు. ఏటా 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్.. ఏడు నెలల్లో 6,033 పోస్టులే ఇచ్చినందన, ఇంకా 1,94,000 పోస్టులు భర్తీచేయాల్సి ఉన్నదని చెప్పారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికైనా పరీక్ష పెట్టి ఫలితాలు ప్రకటించిందా? అని నిలదీశారు.