హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్ష అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 1180 పోస్టుల తుదిజాబితా కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు బుధవారం నందినగర్లోని ఆయన నివాసంలో కలిశారు.
జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలకు ఎన్నికైన జాబితాను ఇప్పటివరకు వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. 22 నెలల క్రితమే నోటిఫికేషన్ విడుదలై, పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తి అయ్యిందని వెల్లడించారు. ఎన్నికల కోడ్ కారణంగా అభ్యర్థుల తుదిజాబితా నిలిచిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అభ్యర్థులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయమై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.