KTR | హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఆదేశాలతోనే గాంధీ దవాఖాన వద్ద నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దమననీతికి పాల్పడుతుందని, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వారికి సంఘీభావం తెలుపుతున్న ప్రతిపక్ష, విద్యార్థి నేతలను అడ్డుకుంటూ అప్రజాస్వామిక చర్యలకు దిగుతుందని విమర్శించారు.
ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ ఆమరణ దీక్ష చేస్తున్న గాంధీ దవాఖాన వద్ద నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి ఘటనను తీవ్రంగా ఖండించారు. మోతీలాల్ను పరామర్శించేందుకు వెళ్లిన నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని హితవు పలికారు.
మోతీలాల్ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు రాకేశ్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు మోతీలాల్ను కలవనీయకుండా అడ్డుకొని పోలీస్స్టేషన్కు తరలించడం దుర్మార్గమైన చర్య అని, వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలనలో పరామర్శలు, నిరసన తెలిపే హకులు లేవా అని నిప్పులు చెరిగారు.నిరుద్యోగుల డిమాండ్ల మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏడు నెలలైనా ఒక్క నోటిఫికేషన్ లేదు
తెలంగాణలో 1.40 లక్షల ఉద్యోగాలు, మరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే.. రాహుల్గాంధీ హైదరాబాద్లోని అశోక్నగర్ వచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని,పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులకు ప్రభుత్వ విధానం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా, ఇతర విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులు ఆగ్రహం తో నిరసనలు చేపడుతున్నారని, మోతీలాల్ చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీని తన్ని తరిమివేశారని చెప్పారు.