హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం పరిగణనలోకి తీసుకోకుండానే ఉన్నవి, లేనివి మ్యానిఫెస్టోలో పెట్టి అలవికాని హామీలు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల ముందు వరకు రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 3న.. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ కూడా తక్షణమే చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన తర్వాత జరిగే తొలి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారని, కానీ, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒక్కటే చేశారని, కాంగ్రెస్ చెప్పన మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని కూడా ఉన్నాయని, వాటి ఊసేలేదని అన్నారు.
యువతులందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం, ఇలా అనేక హామీలు ఇచ్చారని వెల్లడించారు. హామీలు ఇచ్చే ముందే లెక్కలు చూసుకోవాలని, కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు లెక్కలు చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ ప్రజలను మభ్యపెట్టలేదని, చేయగలిగిన వాటి గురించే తాము మాట్లాడామని స్పష్టం చేశారు. కొత్తగా శ్వేత పత్రం పేరుతో విడుదల చేయాల్సింది ఏముంటుందని ప్రశ్నించారు. వాస్తవానికి ఏటా ప్రభుత్వ లెక్కలన్నింటినీ కాగ్ సహా ఆడిట్ సంస్థలు ఆడిట్ చేస్తాయని, ఆడిట్ చేసిన దానిపై పీఏసీ వంటి సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని వివరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం ప్రస్తావిస్తుందో చూస్తామని, తాము కూడా ప్రభుత్వానికి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.