రవీంద్రభారతి, జూన్ 29: యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. యూనివర్సిటీలలో 2400 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ప్రభుత్వరంగ, ఇతర సంస్థల చైర్మన్, డైరెక్టర్ పోస్టులలో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నట్టు బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. 100 గురుకుల పాఠశాలలు, 50 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత నీల వెంకటేశ్, సి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.