Sitarama Project | ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో కృషి చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు, రైతులు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ కృషి వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు రైతులు. ప్రాజెక్టు వద్ద జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అన్నదాతలు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ‘సీతారామ’ పేరిట గోదావరిపై ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న శ్రీకారం చుట్టారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో రూ.17 వేల కోట్ల అంచనాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర సాగునీటి పథకాన్ని చేపట్టారు. 2016 ఫిబ్రవరి 18న జీవో నెంబర్ 72 ద్వారా రూ.7,926 కోట్ల నిధులను మంజూరు చేసింది. తర్వాత దశల వారీగా నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా నీరందించేందుకు పనులు చేపట్టింది. మూడు జిల్లాల్లో కలిపి మొత్తంగా 6,74,387 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు శ్రమించింది. ట్రయల్ రన్ తరువాయి అనే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి.
ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తన గొప్పగా చెప్పుకుంటున్నది. గురువారం జిల్లాకు వచ్చిన నలుగురు మంత్రులు.. కనీసం వ్యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్టును పరిశీలించలేదు. కేవలం సీతమ్మబరాజ్ను, కాలువను పరిశీలించి వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్హౌస్ ట్రయల్ రన్ను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. కుమ్మరిగూడెం వద్ద నుంచి తొమ్మిది కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా బీజీ కొత్తూరు పంప్హౌస్ వరకు చేరనున్న గోదావరి జలాలు ఎత్తిపోతల ద్వారా ఒక్కసారిగా పరవళ్లు తొక్కాయి.
సీతా రామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతంగా జరగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల వాంచ నెరవేరిందని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేతలు, రైతులు. pic.twitter.com/gCSxoA1qoo
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024