‘తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన, అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు’
– కేసీఆర్
KCR | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిపాయిల్లాంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని అభివర్ణించారు. ప్రజల్లో చైతన్యం వచ్చి, కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ను ఆదరిస్తారని చెప్పారు. అప్పటి దాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టిసారించి, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో బాల్కొండ, హుజూరాబాద్, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కందాళ ఉపేందర్రెడ్డితోపాటు స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం రాదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీ బీఫారం ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని తెలిపారు.
‘తెలంగాణ కోసం సాగిన మన 25 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదు. అయిపోలేదు. నాడు ఎన్టీఆర్ను ఎట్లా అయితే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ను ప్రజలు తిరిగి ఆదరిస్తారు. అవసరం అయితే అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుంది’ అని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతున్నదని, నిచ్చెన మెట్లు ఎకేది పోయి, దిగజారుకుంటూ వస్తున్నదని విశ్లేషించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, రైతుబంధు పథకాలు అమలు కావడం లేదని, తాగునీరు, సాగునీరు, విద్యుత్తు సరఫరా కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు ఒక్కొక్కటిగా తమ మనసుల్లో రికార్డు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, మళ్లీ గాడిన పెడతామని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని, తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించామని కేసీఆర్ వివరించారు. స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణ ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని, ఉద్యమంతోపాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇంతటితో ఆగిపోలేదని, అయిపోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మరిన్ని గొప్ప లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆరు దశాబ్దాలపాటు దికుమొకు లేక, ఏ ఆదరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి చేర్చేందుకు నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దాకా అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమవుతున్న తెలంగాణను అకున చేర్చుకుని మళ్లీ గాడిలో పెట్టేదాకా ఆ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
‘తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన, అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు’ అని కేసీఆర్ పునరుద్ఘటించారు. ‘తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కుమొక్కు లేని పరిస్థితి. సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని ఇట్లాంటివి జరుగుతుంటాయని చరిత్రలోకి వెళ్తే అర్థం అవుతుంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారని, ‘పాలిచ్చే బర్రెను ఒదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది’ అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
పార్టీ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టు గురువారం నాటి సమావేశం సంకేతాలిచ్చింది. ఎంపికచేసిన నియోజకవర్గాలవారీగా ముందస్తు సమాచారంతో నిర్దేశిత సమయం ప్రకారం అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్చార్జీలకు ఇచ్చిన సమయం మేరకు అధినేతతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు కొనసాగనున్నాయి.
కేసీఆర్ను కలిసేందుకు బాల్కొండ, ఆర్మూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీపడ్డాయి. కాగా, ప్రముఖ స్త్రీవాద కవయిత్రి మహెజబీన్ తన కవితా (ఆకురాలు కాలం) సంకలనాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమె సాహితీ ప్రస్థానాన్ని అభినందించారు.