హైదరాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భారతజాతి ముద్దుబిడ్డ పీవీ అని చెప్పారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ నరసింహారావు అందించిన స్ఫూర్తి మరువలేనిదని తెలిపారు.
కాగా, మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు.. దేశానికి ఎనలేని సేవలు చేసినప్పటికీ కాంగ్రెస్ పాలకులు ఆయనను విస్మరించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీకి సముచిత గౌరవాన్నిచ్చింది. ఆయన ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. మహనీయుడి చరిత్ర మరుగున పడిపోతున్న తరుణంలో ‘పీవీ మన తెలంగాణ ఠీవీ’ అంటూ నరసింహారావు ఖ్యాతిని మరోసారి ఎలుగెత్తిచాటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఏడాది పాటు ఘనంగా శత జయంతి ఉత్సవాలు జరిపింది.