KCR | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తన చేష్టలతో తానే ప్రజలతో ఛీ కొట్టించుకోవటం 50 ఏండ్ల కాంగ్రెస్ వైఖరి అని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారన్న విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని వెల్లడించారు.
ఆ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు నాలుక కరుసుకుంటున్నారని చెప్పారు. కొత్తవి అమలుచేయడం అటుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనూ ఎగ్గొడుతూ మోసం చేస్తున్న సర్కారు నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల నుండి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన.. దికుమొకులేని చివరిదశ ఉద్యమకాలం నుంచి.. తెలంగాణ రాష్ట్ర సాధన, పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కొన్న కష్టాలను కార్యకర్తలకు వివరించారు. ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. రాసిందే రాత, గీసిందే గీత’గా నడిచేదని గుర్తుచేశారు.
అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న చంద్రబాబును ఎదిరించి నిలవటం అంటే ఆశామాషీ వ్యవహారం కాదని తెలిపారు. అలాంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎలాంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా కల్పించారు.
గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉన్నదని, భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు. ‘రాజకీయ జీవితంలో ప్రజలు ఎటువంటి బాధ్యతను అప్పగించినా నిర్వర్తించడమే కార్యకర్తలు, నాయకుల లక్షణం. అధికారముంటేనే పనిచేస్తామంటే రాజకీయ నాయకుల జీవితం గుడ్డెద్దు చేన్ల పడ్డ చందంగా తయారవుతుంది’ అని వెల్లడించారు.
పేరుపేరునా ధన్యవాదాలు
‘నన్న కలుద్దానికి పిలిచినోళ్లు, పిలవనోళ్లు రోజూ వేలమంది వస్తున్నరు. మీ అభిమానానికి థాంక్స్. అయితే అంతమందికి ఐదారు గంటలపాటు నిలబడి ఫొటోలు దిగాల్నంటే కాలిరిగిన నాకూ ఇబ్బందే అయితున్నది. ఒక మనిషి వేలమందితో నిలబడి ఫొటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి. అందుకే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకే ఆహ్వానించాలనుకున్నాం. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం.
చెప్పినవాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న అభిమానానికి మరోసారి పేరుపేరునా ధన్యవాదాలు’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని మరోసారి విన్నవించారు.
సమావేశంలో మాజీమంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తకెళ్లపల్లి రవీందర్రావు, కోటిరెడ్డి, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాసర్రావు, రమావత్ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్, బూడిద భిక్షమయ్యగౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటమితో దిష్టి తీసినట్టయ్యింది
శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఓటమితో దిష్టి పోయిందని, తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి.. నేటి పరిస్థితులు ఒక లెకే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను సాధిస్తూ ముందడుగు వేస్తుందని పునరుద్ఘాటించారు.
‘మరికొద్ది రోజుల్లోనే టార్చ్లైట్ పట్టుకొని జనం దేవులాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కోసం వస్తారు. ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ అండగా నిలబడ్డ బీఆర్ఎస్ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది’ అని వెల్లడించారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై పోరాడుతూ, వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
Kcr