K Kesha Rao | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావు (కేకే) తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారన్న చర్చ అప్పుడే మొదలైంది. కేకే పదవీకాలం ముగిసేందుకు ఇంకా రెండేండ్ల సమయం ఉన్నది. దీంతో పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడిన నేతలు, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్ నాయకులు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, వీరి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి ఆ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
హిమాచల్ప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సింఘ్వీ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరెక్కడి నుంచైనా రాజ్యసభకు పంపాలని అధిష్ఠానం యోచిస్తున్నది. ఇప్పుడు కేకే రూపంలో సింఘ్వీకి అదృష్టం కలిసొచ్చింది. రాజ్యసభ పదవికి రాజీనామా చేశాకే కేకే పార్టీలో చేరుతారన్న సమాచారం నెల కిందటే కాంగ్రెస్ అధిష్ఠానానికి చేరింది. దీంతో ఆ స్థానాన్ని అభిషేక్ సింఘ్వీకి ఇవ్వాలని అప్పుడే కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత కేకేకు క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి ఇవ్వనున్నట్టు గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కంటే తానే సీనియర్నని కేకే వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉన్న రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం కేకే నివాసానికి వెళ్లారు. అనంతరం రేవంత్తో కలిసి మీడియాతో మాట్లాడిన కేకే ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు వెళ్లడంతో పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తినేనని, ఆ మాటకొస్తే పార్టీ అధ్యక్షుడు ఖర్గే కంటే తానే రెండేండ్ల సీనియర్నని చెప్పుకొచ్చారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపీల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు నెలల పాలన వాస్తవిక దృక్పథంతో, ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధిపథంలో సాగుతున్నదని కితాబిచ్చారు. తన సేవలను ఏ విధంగా వినియోగించుకుంటారన్నది పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరాక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నట్టు చెప్పారు.
కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేకే వివరించారు.