హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డికి జిస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ లేఖను పంపింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ సెక్షన్లు 80(బీ), 80(సీ) ప్రకారం ఏదైనా వివరణ ఇవ్వదల్చుకుంటే వారం రోజుల్లో ప్రత్యక్షంగా లేదా లేఖ ద్వారా ఇవ్వాలని ఆ లేఖలో జగదీశ్రెడ్డికి సూచించింది. అవసరమైతే క్రాస్ ఎగ్జామినేషన్కు సైతం అవకాశమిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుతోపాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరిపేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డితో ఏకసభ్య సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. గత 3 నెలల నుంచి విచారణ జరుపుతున్న ఈ కమిషన్ ఇప్పటివరకు 25 మందికి లేఖలు రాసింది. 24 మంది ఐఏఎస్లతోపాటు మాజీ సీఎం కేసీఆర్కు ఈ లేఖలు రాసిన కమిషన్.. విద్యుత్తు సంస్థల మాజీ సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్రావు, సురేశ్చందా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి, అజయ్మిశ్రా, ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, విద్యుత్తు జేఏసీ నేత రఘు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తురంగ నిపుణుడు వేణుగోపాల్రావు తదితరులను ప్రత్యక్షంగా విచారించింది. విచారణ సంఘం నుంచి లేఖలు అందుకున్న వారంతా ఇప్పటికే తమ వివరణలను కమిషన్కు సమర్పించారు. ఇటీవలి కాలంలో విచారణ సంఘం పలువురిని ప్రత్యక్ష విచారణకు పిలిచి వారి నుంచి వివరాలను సేకరించింది. విచారణ సంఘం నోటీసుల మేరకు జూన్ 14న మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖను కమిషన్కు పంపారు.