హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్కేభవన్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘు కమిషన్ ముందు హాజరై మ. 12:33 గంటల ప్రాంతంలో విచారణ ముగిసింది. జస్టిస్ నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడతారనుకొని ప్రతినిధులంతా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ లేఖ సంధించిన నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డి స్పందిస్తారని అనుకున్నారు. అప్పుడే కమిషన్ కార్యాలయంలో ఉండొద్దని పోలీసులు సూచించారు. మీడియా ప్రతినిధుల వాగ్వాదంతో ఆఖరుకు పోలీసులు శాంతించారు. ప్రొఫెసర్ కోదండరాం, రఘు బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ వెంటే ఒకటిన్నర గంటల ప్రాంతంలో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి సైతం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఉత్సుకత చూపే ఆయన ఇలా ముఖం చాటేసి వెళ్లడమేంటని మీడియా ప్రతినిధులు గుసగుసలాడటం కనిపించింది.