హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లు, ప్లాంట్లపై ఏర్పాటుచేసిన జస్టిస్ నర్సింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖలో తప్పేమున్నదని కాంగ్రెస్ పార్టీ నేత శరత్చంద్ర ప్రశ్నించారు. కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది? అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు అనాలోచితమైనవి, అపరిపక్వమైనవి అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ వేరు, జ్యుడీషియల్ కమిషన్లు వేరని వివరించారు. జస్టిస్ నర్సింహారెడ్డి ఇరుపక్షాల వాదనలు వినకముందే విలేకరుల సమావేశం నిర్వహించి తీర్పు వెల్లడించటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ జ్యుడీషియల్ కమిషన్ వేసే ముందు ఎవరిని సంప్రదించిందని ప్రశ్నించారు. జ్యుడీషియల్ కమిషన్ వేసేముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వారి సలహాలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశాన్ని కనీసం మంత్రివర్గంలోనైనా చర్చించారా? అని నిలదీశారు. ప్రభుత్వం వేసిన జ్యుడీషియల్ కమిషన్ కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ (నిజ నిర్ధారణ కమిటీ) మాత్రమేనని అన్నారు. అవసరమైన సమాచారాన్ని తీసుకోవటం, వ్యక్తులను ఎగ్జామిన్ చేయటం, క్రాస్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇవ్వటమే తప్ప న్యాయవ్యవస్థలో జస్టిస్ నర్సింహారెడ్డి భాగం కాదని స్పష్టంచేశారు. నిజనిర్ధారణ చేసే ప్రక్రియలో కమిషన్కు నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తికి సంయమనం ఉండాలని సూచించారు.
కమిషన్కు చైర్మన్ తన విచారణ అంశాలను ముందుగానే ప్రిజుడిస్గా ముందే మాట్లాడొచ్చా? జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన అభిప్రాయాలను ఎలా వెల్లడిస్తారు? అని శరత్చంద్ర ప్రశ్నించారు. జస్టిస్ నర్సింహారెడ్డి తాను పరిశీలించిన దానిపై నివేదిక ఇవ్వాల్సిన అంశాలన్నీ ముందే మాట్లాడితే ఏం అర్థం వస్తుంది? అని అన్నారు. కేసీఆర్ తన అంతరాత్మప్రబోధం మేరకు ‘మీరు చేస్తున్న ప్రక్రియ సరిగా లేదు. ముందే వెల్లడించిన తీర్పులా ఉంది. నివేదికలో ఏమి ఉండబోతున్నదో స్పష్టంగా తెలిసిపోయింది. ఎవరినో సంతృప్తి పరిచేందుకు మాట్లాడుతున్నట్టుగా ఉంది అనే భావన నాకు కలిగింది’ అన్నారని, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయాలన్నారని, అంతేకానీ రిటైర్డ్ జడ్జీలతోనో, ఆస్థాన విద్వాంసులతోనో వేయాలని కోరలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.