హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్నది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గాంధీ, ఉస్మానియా, కాకతీయతోపాటు రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కాలేజీల ముందు భైఠాయించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు.
సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మి నిస్టర్స్ క్వార్టర్స్లో చర్చలు జరిపారు. జూడా లు తమ ఎనిమిది డిమాండ్లను మంత్రి ముం దుంచారు. చర్చల అనంతరం జూడా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. మంత్రి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. స్టైపెండ్ చెల్లింపునకు గ్రీన్చానల్పై మరోమారు చర్చించి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల నిర్మాణం, హాస్టల్ భవనాల నిర్మాణానికి ఫైల్ను ఆర్థిక శాఖకు పంపినట్టు చెప్పారని పేర్కొన్నారు. వైద్యుల భద్రతకు హామీ ఇచ్చారని, కొత్త మెడికల్ కాలేజీలకు బస్ సౌకర్యంపై డీఎంఈతో చర్చించాలని సూచించారని తెలిపారు. అయితే, పూర్తిస్థాయిలో అన్ని డిమాండ్లపై హామీలు రాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. అనంతరం జూడా ప్రతినిధులు కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వెళ్లారు. డీఎంఈ వాణితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు.