Junior Doctors | హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హామీతో సమ్మె విరమించినట్లు జూడాలు పేర్కొన్నారు. జూడాలు విధించిన 8 డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించేలా చర్యలు
ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో కొత్త హాస్టల్ బిల్డింగ్ల నిర్మాణానికి నిదుల కేటాయింపు
కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు
సూపర్స్పెషాలిటీ ఆర్డర్కు వీలైనంత త్వరగా సవరణ
కొత్త మెడికల్ కాలేజీలకు బస్సుల సదుపాయం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎస్పీఎఫ్తో డాక్టర్లకు రక్షణ
ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో జూనియర్ వైద్యుల వసతి గృహాల నిర్మాణానికి, కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తూ జీవో విడుదలైంది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు రూ. 204.85 కోట్లు కేటాయించారు. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ. 121.90 కోట్లు, గాంధీ ఆస్పత్రికి రూ. 79.50 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్లకు రూ. 2.75 కోట్లు కేటాయించారు.