రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ఉమ్మడి కోటా, ఈడబ్ల్యూఎస్ కోటాపై తేల్చడంలో ఆరోగ్యశాఖ 4 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నది. విభజన చట్టం ప్రకారం పదేండ్లపాటు రెండు రాష్ర్టాల్లోని అన్నిరకాల ఉన్నత విద్యాసంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ‘ఉమ్మడి కోటా’గా కేటాయించాల్సి ఉంటుంది. ఆ సీట్లను మెరిట్ ఆధారంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులతో భర్తీ చేస్తారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయి. వీటిలో 15 శాతం అంటే 280 సీట్లు ఉమ్మడి కోటాగా ఉన్నాయి. ఏటా ఇలాగే భర్తీ చేస్తున్నారు.
MBBS Seats | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటా అమలు చేస్తే దాదాపు 520 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, అన్రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేసింది. ఈ మేరకు గత ఏడాది వరకు 280 సీట్లకే ఉమ్మడి కోటా అమలైంది. వీటికి అదనంగా నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు ఉమ్మడి కోటా కింద భర్తీ అవుతున్నాయి. అయితే, ఉమ్మడి కోటాకు జూన్ 2తో కాలం చెల్లింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కోటాను రద్దు చేస్తూ, స్థానికతను నిర్ణయిస్తూ జీవో విడుదల చేయాల్సి ఉన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. మరో వారంలో హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్, ర్యాంకింగ్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుంది. ఆలోగా ప్రభుత్వం స్పందించకపోతే 280 ఎంబీబీఎస్ సీట్లు, 150 పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది.
ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ప్రస్తుతం 6 కాలేజీల్లోనే ఈ కోటా అమలవుతున్నది. సీట్ల సంఖ్యను 10 శాతం మేర పెంచినప్పుడే మిగతా రిజర్వేషన్లకు ఇబ్బంది కలగకుండా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. సీట్లు పెంచే అవకాశం లేనప్పుడు ఉన్న సీట్లలోనే సర్దుబాటు చేయాలని ఇటీవల ఎన్ఎంసీ స్పష్టంచేసింది. ఈ మేరకు ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో కోటా అమలు చేసేలా వైద్యారోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు విడుదల కావాలి. లేకపోతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు.
పదేండ్ల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నుంచి పాత పద్ధతిలోనే ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇదే తరహాలో వైద్యవిద్యలోనూ స్థానికతను నిర్ణయించాలని హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా వైద్యారోగ్యశాఖ నుంచి చడీచప్పుడు లేదు. ప్రవేశాల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే వారంతా న్యాయపోరాటానికి దిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.