Naveen Nayak | శేరిలింగంపల్లి, జూన్ 29: సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నవీన్నాయక్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవాడు. జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకు సాధించి త్రిసూర్లోని నిట్ కళాశాలలో బీటెక్లో చేరాడు. అక్కడి స్నేహితుల చెడుసావాసంతో గంజాయి, డ్రగ్స్కు బానిసగా మారి చదువును మధ్యలోనే వదిలేసి తన జీవితాన్నే చిత్తు చేసుకున్నాడు. తాజాగా గంజాయి కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నానంటూ పశ్చాత్తాపం పడుతున్నాడు. ఈ కేసులోనే కాకుండా మత్తు పదార్థాలను సేవిస్తూ పలు కేసుల్లో నిందితుడిగా పట్టుబడ్డాడు. మాదాపూర్లో గంజాయి విక్రయిస్తున్న ఓ సరఫరాదారుడితోపాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్న నవీన్నాయక్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసు వివరాలను శనివారం మదాపూర్ డీసీపీ కార్యాలయంలో టీజీన్యాబ్ ఎస్పీ సాయిచైతన్య, డీసీపీ జీ వినీత్ వెల్లడించారు. హైదరాబాద్లోని దూద్బౌలికి చెందిన మోతికార్ సచ్చితానంద్ (28) దూల్పేట్ ప్రాంతానికి చెందిన రాజాతో కలిసి గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నాడు. శనివారం మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని హైటెక్స్ ప్రాంతంలో సచిన్ గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు టీజీన్యాబ్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.
సచిన్తోపాటు కొనుగోలుదారులైన సికింద్రాబాద్కు చెందిన నిట్ పూర్వవిద్యార్థి కురుమోతు రాథోడ్ నవీన్నాయక్ (27), కూకట్పల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ప్రణీత్రెడ్డి (25), బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన రాహుల్రాజ్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నాడు. సచ్చితానంద్ సచిన్ను పోలీసులు విచారించగా డ్రగ్ పెడ్లర్లు బెంగళూర్కు చెందిన రిత్విక్, ఇంతియాజ్, జీవన్, మహేశ్, గచ్చిబౌలికి చెందిన హరీశ్రెడ్డి, వైజాగ్కు చెందిన మ్యాక్సీ, గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన సచిన్ వద్ద కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించాడు. గంజాయి విక్రయానికి పాల్పడుతున్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : నాంపల్లి ప్రాంతం హైదరాబాద్ నగరంలోని నడిగడ్డ.. పోలీసు అడ్డా.. డీజీపీ ఆఫీసు, అసెంబ్లీ, తెలుగు యూనివర్సిటీ.. గాంధీ భవన్, బీజేపీ ఆఫీసు, పక్కనే ఆబ్కారీ భవన్.. నిత్యం పోలీసులు సంచరించే ప్రాంతం.. అయినా ఆ చుట్టుపక్కలే నడిరోడ్డుపై గంజాయి సేవిస్తూ.. పేకాట ఆడుతుండటం విస్మయానికి గురి చేస్తున్నది. లక్డీకపూల్ నుంచి నాంపల్లి ఆబ్కారీ భవన్ వరకు రోడ్లపై సంచరిస్తున్న కొందరు పోలీసులంటే భయం లేకుండా మెట్రో పిల్లర్ ఏ1267 దగ్గర పేకాట ఆడుతున్నారు. ఆ దారినపోతున్న పోలీసులు సైతం అటుగా ఓ కన్నేయకపోవడం ఆశ్చర్యకరం. పేకాటలో నలుగురు నిమగ్నమైతే.. గంజాయి సేవించి మత్తులో మరో ఇద్దరు దొర్లుతున్నారు. ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది.