Jagadish Reddy | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఒప్పందాలు, పవర్ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా వినకుండానే వేలకోట్ల నష్టం వాటిల్లిందని కమిషన్ ఎలా నిర్ధ్ద్దారిస్తుందని ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషన్కు తాను రాసిన లేఖను జగదీశ్రెడ్డి విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ విద్యుత్తును రూ.3.90 చొప్పున కొనుగోలు చేసిన నాటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి విద్యుత్తును యూనిట్ను రూ.17 చొప్పున కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉన్నదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఇరుకునపెట్టాలని చూశారని ఆరోపించారు.
భద్రాచలంలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలిపిన విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కేసీఆర్పై నింద వేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్తు డిమాండ్ మేరకు విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని స్పష్టంచేశారు. ఛత్తీస్గఢ్తో కుదుర్చున్న ఒప్పందంలో కేసీఆర్తోపాటు నాడు ఆ రాష్ట్ర సీఎంగా రమణ్సింగ్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. విద్యుత్తు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలు ప్రభుత్వరంగ సంస్థల మధ్య జరిగాయని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య ఎకడైనా లంచం తీసుకునే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్కు రాసిన లేఖలో పలు కీలక అంశాలను సోదాహరణంగా జగదీశ్రెడ్డి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు రంగ పరిస్థితిని కమిషన్కు రాసిన లేఖలో జగదీశ్రెడ్డి వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అప్పటికే అందుబాటులో ఉన్న విద్యుత్తులో 53.89% తెలంగాణకు, 46.1.1% ఏపీకి కేటాయించిందని, అదే దామాషాలో పదేండ్లపాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించిందని వివరించారు. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రానికి 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రంలో లాబీయింగ్ చేసి బలవంతంగా గుంజుకున్నదని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ విద్యుత్తు పరిస్థితి మరింత దిగజారడమే కాకుండా విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావలసిన విద్యుత్తును ఇవ్వకుండా ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు.
పరిశ్రమలకు మూడు రోజుల పవర్ హాలిడేస్తోపాటు, భారీగా విద్యుత్తు కోతలు ఉండేవని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ప్రభుత్వం మొదట విద్యుత్తు రంగంపై దృష్టిపెట్టి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించే చర్యలకు ఉపక్రమించిందని తెలిపారు. కొత్త విద్యుత్తు ప్రాజెక్టులను వేగంగా నిర్మించాలని, తక్షణమే సంక్షోభం నుంచి బయటపడేందుకు దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్తును త్వరితగతిన కొనుగోలు చేయాలని విద్యుత్తు సంస్థలను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
ఛత్తీస్గఢ్ విద్యుత్తును తెచ్చుకొనేందుకు ఉన్న అవకాశాలపై ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థల అధికారులు చర్చించినట్టు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును తీసుకొనిరావడానికి ట్రాన్స్మిషన్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్తో మన విద్యుత్తు సంస్థల అధికారులు సంప్రదింపులు జరిపిన విషయాన్ని ఆ లేఖలో సోదాహరణంగా వివరించారు. ఆ సమయంలో ఉత్తరాది రాష్ర్టాలతో అనుసంధానం చేసుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నదని వివరించారు.
తెలంగాణ విద్యుత్తు సంస్థలు విద్యుత్తు కొనుగోలు కోసం ఓపెన్ టెండర్లకు ఆహ్వానిస్తే, ఏపీ విద్యుత్తు సంస్థలు చట్టప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్తును ఇవ్వకపోవడమే కాకుండా, ఆ టెండర్లో పాల్గొని యూనిట్ ధరను రూ. 5.35 కోట్ చేశాయరని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు పీజీసీఐఎల్ లైన్లో వాటా కొనుగోలు వల్ల కానీ, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు వల్ల కానీ తెలంగాణకే మేలు జరిగిందని, ఎటువంటి నష్టం జరగలేదన్నారు.
సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా నిర్మించిన భద్రాద్రి విద్యుత్తు కేంద్రం ఆనాడున్న చట్టాలకు, నిబంధనలకు లోబడే జరిగిందని జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో విద్యుత్తు విషయంలో ఆనాడున్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జెన్కో ఆధ్వర్యంలోనే విద్యుత్తు ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. బీహెచ్ఈఎల్ అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు ముందుకొచ్చిందని వివరించారు. అనేక చర్చలు, సంప్రదింపుల్లో భాగంగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి కేవలం నాలుగేండ్లు పడుతుందని, తాము రెండేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి 1080 మెగావాట్ల విద్యుత్తును అందిస్తామని, 2017 మార్చిలోపే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని వివరించారు.
నాడు ఎన్టీపీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలతోపాటు దేశంలో తయారయ్యే విద్యుత్తు 90 శాతంపైగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మితమయ్యాయనే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో అప్పటికే 17 విద్యుత్తు ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మాణంలో ఉన్నాయని ఉదహరించారు. వాటి కన్నా ముందే మణుగూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకొచ్చిందని తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలకు నామినేన్పై పనులు అప్పగించే అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణానికి బీహెచ్ఈఎల్, జెన్కో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. కొత్తగూడెం ప్రాజెక్టును బీహెచ్ఈఎల్ 48 నెలల్లోనే పూర్తి చేసిందన్నారు. మణుగూరు విషయంలో ఎన్జీటీ స్టే విధించడం, కొవిడ్ వల్ల కొంత ఆలస్యమైందని వివరించారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్లను కూడా 50% పీఎల్ఎఫ్ఏతో నడుపాలని కేంద్రం ఇచ్చిన మెమోతో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ టెక్నాలజీల వాదానికి అర్ధమే లేకుండా పోయిందని పేర్కొన్నారు.
రైతులకు కూడా 24 గంటల విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంటు (యూఎంపీపీ) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని జగదీశ్రెడ్డి వివరించారు. విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి భూమి, నీరు, రోడ్డు రవాణా, రైలు రవాణా సౌకర్యాలు ముఖ్యమైనవని, అయితే ఇందులో బొగ్గు కేటాయింపు (కోల్ లింకేజీ) పూర్తిగా కేంద్రం అధికారమని పేర్కొన్నారు. దేశంలో బొగ్గుతో విద్యుత్తు తయారు చేసే ప్లాంట్లు అన్నీ విధిగా 10% విదేశీ బొగ్గును వాడాలని, ప్లాంటు నుంచి భారీగా వెలువడే ఫ్లైయాష్ను వెంటవెంటనే డిస్పోజ్ చేయాలన్న ఎన్జీటీ నిబంధన కూడా ఉన్న విషయాన్ని ఆయన లేఖలో ఉదహరించారు.
ఫ్లైయాష్ను వెంటవెంటనే తీసుకొనిపోవడానికి సిమెంట్ కంపెనీలు ముందుకొచ్చిన విషయాన్ని ఉటంకించారు. విదేశీ బొగ్గు వాడాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను కఠినంగా అమలు చేసినా పోర్టులన్నింటికీ అతి చేరువలో ఉన్న ప్రాంతం దామరచర్ల అని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే యూఎంపీపీ నిర్మాణం పూర్తిగా సహేతుకమైనదని స్పష్టం చేశారు. ఏ ఒక్క భారీ పరిశ్రమ కూడా లేని నల్లగొండకు విద్యుత్తు ప్రాజెక్టు రావాలన్న జిల్లా ప్రజల కోరికను నాడు మంత్రిగా ఉన్న తాను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చానని, ఈ నేపథ్యంలో నాటి దార్శనిక ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయంగా జిల్లా ప్రజలు భావించారని ఉదహరించారు. దేశంలో కొన్ని విద్యుత్తు ప్లాంట్లు విదేశీ బొగ్గుతో నడుస్తున్నాయని ఉదహరించారు. బొగ్గు ఉన్న చోటే విద్యుత్తు ప్లాంటు నిర్మించాలనేది అర్థ రహిత వాదన అని జగదీశ్రెడ్డి కొట్టిపారేశారు.
విద్యుత్తు రంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని జగదీశ్రెడ్డి కొట్టిపారేశారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు వల్ల తెలంగాణ రాష్ట్రం 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశానికి అన్నపూర్ణగా మారిందని కొనియాడారు. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించడం వెనుక విద్యుత్తు రంగ విజయం ఉన్నదని తెలిపారు. వేలాది పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొనిరావడం వల్ల దాదాపు 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు.
రాష్ట్రం నుంచి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షల కోట్లకు పెరగడంతోపాటు తలసరి ఆదాయం పెరుగుదల వెనుక కూడా విద్యుత్తురంగ విజయమే ఉన్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం నాడు 1196 కిలోవాట్ అవర్స్ ఉండగా నేడు అది 2349 కిలోవాట్ అవర్స్కు పెరిగిందని దీనికి కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణమని స్పష్టం చేశారు.
విచారణ సమయంలో భాగస్వాములైన ప్రతి ఒకరినీ విచారించాలనే విషయం తెలిసినా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఒప్పందాలు ఆనాటి తెలంగాణ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, రమణ్సింగ్, ఇరు రాష్ర్టాల ప్రభుత్వ అధికారులు, విద్యుత్తు సంస్థల అధికారుల మధ్య జరిగాయని వివరించారు. భద్రాద్రి ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చాయని, అందులో కేంద్ర మంత్రులు, అధికారులు భాగస్వాములు అవుతారనే విషయం కమిషన్కు తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడానికి ఎస్జీటీ స్టే విధించడంతోపాటు వివిధ శాఖల నుంచి రావలసిన అనుమతుల్లో జాప్యమే కారణమని వివరించారు.
విచారణాంశాల్లో భాగస్వాములైన అందరినీ విచారిస్తేనే కమిషన్ సరైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాల అభిపాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కొద్దిమందితో మాత్రమే సమాచారం తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి ఒకపక్షం వాదనలతో జస్టిస్ నర్సింహారెడ్డి ఏకీభవించడం బాధాకరమని పేర్కొన్నారు. కమిషన్ అలా వ్యవహరించడం వల్ల తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్ధరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్టు అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం తరువాత ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికగా రూ.6 వేల కోట్ల నష్టం కథనాలు ప్రచురితం కావడం, ఆ సమాచారం ఎవరి ద్వారా వచ్చింది? ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారు? తదితర అంశాలన్నీ కూడా విచారణలో భాగం కావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఇలా చేయకపోతే కేవలం గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ను బద్నాం చేయడం కోసమే విచారణ జరుపుతున్నట్టు తాము భావించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ బిడ్డగా వాస్తవాలు ప్రజలకు నిస్పక్షపాతంగా ఉండాలని భావించిన తమకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా నివేదిక ఇవ్వబోతున్నదనే విషయం స్పష్టమైందని ఆక్షేపించారు. ఆనాటి ప్రభుత్వంపై, కేసీఆర్పై కమిషన్ వ్యతిరేక భావనతో ఉన్నట్టు తేలిపోయిందని ఆరోపించారు. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో కమిషన్ ఏకీభవించినట్టు జస్టిస్ నర్సింహారెడ్డి మాటలతో తేలిపోయిందని పేర్కొన్నారు. కమిషన్ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పీజీసీఐఎల్ నిబంధనల ప్రకారం మొదట వచ్చినవారికే మొదటి అవకాశం ఇచ్చే వీలున్నదని, ఏదో ఒక ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఉండి తీరాలన్న నిబంధన కూడా ఉన్నదని జగదీశ్రెడ్డి వివరించారు. విద్యుత్తు అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఛత్తీస్గఢ్తో ఇరురాష్ట్రాల సీఎంల సమక్షంలో ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఎంవోయూ కుదిరిందన్నారు. తెలంగాణ ఈఆర్సీ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధర రూ.3.90గా నిర్ణయించిందని గుర్తుచేశారు. ఆ సమయంలో రాష్ట్రం వివిధ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు యూనిట్కు రూ.5 నుంచి రూ.17 వరకు చెల్లించిందని ఉదహరించారు. అదే సమయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు టెండరు పద్ధతిలో యూనిట్కు రూ.4.94ల చొప్పున కొనుగోలు చేయడానికి పీపీఏ(ఐపీపీ)లు చేసుకున్నాయని పేర్కొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ద్వారా జనవరి 2024 నుంచి మన రాష్ట్రానికి ఇస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్తుకు యూనిట్కు రూ.5.60 పైగా చెల్లిస్తున్న విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చారు.
టీపీఎస్ స్టేజ్ 8 (800మెగావాట్లు) విద్యుత్తు ప్రాజెక్టును రూ.3,810 కోట్ల వ్యయంతో బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిలో ఇచ్చామని జగదీశ్రెడ్డి తెలిపారు. అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టు పనిని రెండు భాగాలుగా చేసి బీటీజీని బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిపై, మరో భాగం బీవోపీని ప్రైవేటు కంపెనీలకు టెండరుపై ఇచ్చిందని ఉదహరించారు. తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-5 (800 మెగావాట్లు) ప్రాజెక్టు బీటీజీని రూ.2,307 కోట్లకు నామినేషన్ పద్ధతుల్లో ఇచ్చిందని, బీవోపీపీ కాంట్రాక్టును ఓపెన్ టెండరులో బీజేఆర్ఏఎస్ఎల్ కంపెనీకి రూ.2,299 కోట్లకు మొత్తం కలిపి రూ.4,606 కోట్లకు ఇచ్చిందని తెలిపారు. ఏపీతో పోల్చితే మన జెన్కో అతితకువ ధరకు బీహెచ్ఈఎల్కు నామినేషన్పై ఇచ్చిందనే విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా బీటీజీని బీహెచ్ఈఎల్కు నామినేషన్ పైనే ఇచ్చిందని తెలిపారు. ఓపెన్ టెండర్ ద్వారా ఇచ్చిన బీవోపీకి తెలంగాణ కంటే ఏపీ ఒక ప్లాంటులో రూ.800 కోట్లు, మరో ప్లాంటులో రూ.1,150 కోట్ల ఎకువ ఇచ్చిందని వివరించారు.
పీజీసీఐఎల్ లైన్లో వాటా కొనుగోలు, చెల్లింపులు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, చెల్లింపులు, మణుగూరు, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలోని హేతుబద్ధత విషయంలో ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావులేదని జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య, ప్రభుత్వ రంగ సంస్థకు మరో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాల్లో ప్రజాధనం దుర్వనియోగానికి అవకాశమే లేదనే కమిషన్కు కూడా తెలుసునని పేర్కొన్నారు. వీటిపై గతంలో శాసనసభలో పూర్తిస్థాయిలో చర్చ జరిగిందని వివరించారు. ఈఆర్సీ వద్ద కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్న వ్యక్తులు వారి అనుమానాలను, అభ్యంతరాలను వ్యక్తీకరించారని, వాటన్నింటినీ విచారించిన తర్వాతే ఈఆర్సీ తన నిర్ణయాలను ప్రకటించిందని స్పష్టంచేశారు.