హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల(Electricity bills) వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి(Adani) అప్పగిం చేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. ఆది వారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తులు విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా పాతబస్తీని(Old city) ఎంచుకున్నారు. కానీ, అది అక్కడికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. విద్యు త్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో ఉండవన్నారు. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదన్నారు. మోదీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మోదీ, అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థ ప్రజల ఆస్తి. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయి . అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగా ణలో 95 నుంచి 97 శాతం వరకు కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయి.
ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేలంలో పాల్గొన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనిని వేలం నుంచి ఎందుకు తీసివేయించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. విద్యుత్ బిల్లుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపాలని డిమాండ్ చేశారు.