హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఓల్డ్సిటీలో విద్యుత్తు బిల్లుల వసూళ్లను అదానీ కంపెనీకి అప్పగిస్తామని లీకులివ్వడం తొలిమెట్టని, అది పాతబస్తీకే పరిమితం కాదని, రాష్ట్రమంతా అమలవుతుందని చెప్పారు. ఇక విద్యుత్తు ఉద్యోగుల పాత్ర నామమాత్రమవుతుందని, వ్యవస్థ మొత్తం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై విద్యుత్తు ఉద్యోగులు, వినియోగదారులు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
విద్యుత్తు బిల్లుల వసూలు కాంట్రాక్ట్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్తు వ్యవస్థ ప్రైవేట్కు వెళ్తే సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక అమలు కాదని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్కు అప్పగించడానికి కేసీఆర్ అంగీకరించలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందుకే మోదీ, అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు.
ఓల్డ్సిటీలో 45 శాతమే కరెంటు బిల్లులు వసూలవుతున్నాయని, అందుకే వసూలు బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగిస్తున్నట్టు ఢిల్లీలో రేవంత్రెడ్డి చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని జగదీశ్రెడ్డి గుర్తుచేశారు. రేవంత్ మాటలు పూర్తి అబద్ధమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓల్ట్సిటీ నుంచి 97-98 శాతం వసూలయ్యాయని తెలిపారు. రేవంత్రెడ్డి చర్యలు ఓల్డ్సిటీ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, ఓల్డ్సిటీలో 200 యూనిట్లలోపే కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎకువ ఉన్నాయని పేర్కొన్నారు.
అలాంటప్పుడు బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. బిల్లుల వసూలు చేతగాక ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారా? లేక విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరంచేయాలని చూస్త్తున్నారా? అని నిలదీశారు. సింగరేణి బొగ్గు గనుల వేలంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారని, శ్రావణపల్లి బొగ్గు గని వేలాన్ని ఎందుకు ఆపలేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని స్పష్టంచేశారు. బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను తాము అనుమతించబోమని ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టంచేసిందని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నేతలు క్యామ మల్ల్లేశ్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.