ఫిరాయింపుదారులకు మంత్రి పదవి ఇవ్వబోమని, కాంగ్రెస్ బీ-ఫారంపై గెలిచిన వారికే పదవి ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు కదా?.. అని మంత్రి దామోదర రాజనర్సింహను విలేకరులు ప్రశ్నించగా.., ఎప్పటికీ ఒకేలా ఉంటుందా? అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాలాన్ని బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయని అన్నారట !
Damodara Raja Narasimha | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హోం శాఖ బాధ్యతలను త్వరలో మంత్రి సీతక్కకు అప్పగించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నట్టు సమాచారం. మంత్రి సోమవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన దానం నాగేందర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పినట్టు తెలిసింది.
నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి దక్కనున్నదని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. ఇప్పుడు ఉన్న పలువురు మంత్రుల శాఖలు మారబోతున్నాయని చెప్పినట్టు సమాచారం. అయితే.. ఫిరాయింపుదారులకు మంత్రి పదవి ఇవ్వబోమని, కాంగ్రెస్ బీ-ఫారంపై గెలిచిన వారికే పదవి ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు కదా?.. అని ప్రశ్నించగా, ఎప్పటికీ ఒకేలా ఉంటుందా? అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాలాన్ని బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయని అన్నారట. 2018లో రాహుల్ గాంధీ స్వయంగా ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వబోమని చెప్పారని, అది అమలు కాలేదు కదా? అనేక మంది ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది కదా అని ఉదహరించినట్టు సమాచారం.
వైద్యారోగ్య శాఖలో త్వరలో భారీ ప్రక్షాళన చేయనున్నట్టు మంత్రి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో ప్రాథమిక వైద్యం, తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు(టీవీవీపీ) ఆధ్వర్యంలో సీహెచ్సీలు, ఏరియా దవాఖానలు, డీఎంఈ పరిధిలో మెడికల్ కాలేజీలు, జిల్లా దవాఖానలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారట. టీవీవీపీని, డీపీహెచ్ను కలిపి కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసేలా ఆలోచిస్తున్నామని చెప్పారట. తద్వారా భవిష్యత్తులో వైద్యవిద్యకు డీఎంఈ, ఆరోగ్య సేవలకు హైల్త్ డైరెక్టరేట్ మాత్రమే ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారని సమాచారం.
త్వరలోనే అమలు చేస్తామని అన్నట్టు తెలిసింది. ‘కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయినా నిర్వహించే శక్తి రాష్ర్టానికి కూడా ఉన్నది. నీట్ను రద్దు చేయాలా? కేంద్రం నిర్వహించాలా? రాష్ట్రాలకు ఇవ్వాలా? అనే అంశంపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో హాస్టళ్ల భవనాలకు పది రోజుల్లో శంకుస్థాపన చేసి, రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీలకు ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నది’ అన్నట్టు సమాచారం.