హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. సాగర్లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్కు తాగునీటిని అందించడం వీలవుతుంది.
తగ్గితే మాత్రం అక్కడి పంపులు నడపడం సాధ్యం కాదు. ప్రస్తుతం సాగర్లో 522.30 అడుగుల నీటిమట్టం ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల నీటి అవసరాలకుగాను 505 అడుగుల వరకు నీటిని వినియోగించుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో 510 అడుగుల కంటే నీటిమట్టం తగ్గితే అది హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది.
వట్టిపోతున్న కృష్ణాబేసిన్
ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రమే కావడం, ఎగువన కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ వట్టిపోతున్నది. ఈ నీటి సంవత్సరంలో తెలుగు రాష్ర్టాల పరిధిలోని ప్రాజెక్టులకు సుమారు 150 టీఎంసీల వరకు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. వర్షాకాలంలో భారీ ఇన్ఫ్లోలు ఉంటేనే ఏడాది పొడవునా రెండు రాష్ర్టాలు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ ఏడాది ఆశించిన ఇన్ఫ్లోలు లేకపోవడంతో సాగునీటి అవసరాలను సైతం తక్కువ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీటిని విడుదల చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ మాత్రం కుడి కాల్వ కింద సాగునీటిని అందిస్తున్నది. ఎగువన శ్రీశైలం నుంచి అటు ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వినియోగించుకుంది. ఇప్పుడు శ్రీశైలంలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోవడంతో నీటిమట్టం పడిపోయి నీటిని విడుదల చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో రెండు రాష్ర్టాలు తమ అవసరాలకు నాగార్జునసాగర్పైనే ఆధారపడాల్సి వస్తున్నది. ప్రస్తుతం 522.30 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉన్నది. రెండు రాష్ర్టాలకు కృష్ణాబోర్డు చేసిన నీటి వినియోగ కేటాయింపులను సాగర్ నుంచే వాడుకుంటామని రెండు రాష్ర్టాల అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 10 టీఎంసీల వినియోగానికి గతంలోనే అనుమతి ఉంది. మరో ఐదు టీఎంసీలు కావాలంటూ అధికారులు బోర్డుకు ఇండెంట్ పెట్టారు. దీంతోపాటు తెలంగాణ కూడా ఎడమ కాల్వ కింద తాగునీటి అవసరాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
అత్యవసర మోటార్లు తప్పవా?
జూన్లో వర్షాకాలం మొదలవుతుంది. నాగార్జునసాగర్కు జూలై, ఆగస్టుల్లో వరద వచ్చే అవకాశాలుంటాయి. దాదాపు ఏడెనిమిది నెలల పాటు ఉన్న నీటి నిల్వలతో నే సరిపెట్టుకోవాలి. ఈ క్రమంలో సాగర్లో 510 అడుగులకంటే నీటిమట్టం తగ్గినట్టయితే అది హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది. సాగర్లో ఈ స్థాయిలో నీటిమట్టం ఉంటేనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటర్లు పంపింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తేనే హైదరాబాద్కు తాగునీటి సరఫరా జరుగుతుంది. రెండు రాష్ర్టాల నీటి అవసరాలు, ముఖ్యంగా ఏపీ ధోరణి చూస్తుంటే కనీసంగా 15 టీఎంసీల నీటినైనా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాగర్ నీటిమట్టం పడిపోతే సాగర్ ఫోర్షోర్లో అత్యవసర మోటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్కు అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిస్థితులు రాగా, అత్యవసర మోటర్లు పెట్టారు. కాకపోతే గత కొన్నేండ్లుగా కృష్ణా బేసిన్కు మంచి వరదలు ఉండడంతో ఆ అవసరం ఏర్పడలేదు. తాజా పరిస్థితుల దృష్ట్యా రానున్న వేసవిలో అత్యవసర మోటర్లు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.