హైదరాబాద్, జులై 2(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై సీఎం రేవంత్రెడ్డి విచారణకు ఆదేశించారు. తమ భూమిని కొందరు నాశనం చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ రైతు ప్రభాకర్ సోమవారం వీడియో ద్వారా ఆవేదనను వ్యక్తం చేశాడు.
పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకొని, తాను చనిపోతున్నానని, తన చావు తర్వాతైనా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్రెడ్డిని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేడుకొన్నాడు. ఆ తర్వాత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంచలనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి తక్షణమే నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటపొలాల పంచాయితీ కోసం ఆత్మహత్యకు పాల్పడొద్దని కోరారు. రైతు మృతి చెందడానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన 10 మందిపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఖమ్మం హవేలీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ భానుప్రకాశ్ వారిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో మంగళవారం పోస్టుమార్టం అయిన తర్వాత ప్రభాకర్ మృతదేహాన్ని స్వగ్రామం ప్రొద్దుటూరుకు తరలించారు. పోలీసు బందోబస్తులో గ్రామస్థుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.
తెలంగాణలో రైతులు ఆత్మహత్యకు పాల్పడే దుస్థితి దాపురించిందని, కాంగ్రెస్ నాంది పలికిన మార్పు ఇదేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే విషాదకరమైన పరిస్థితులు నెలకొనడం బాధాకరమని మాజీ మంత్రి టీ హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో ఓ ప్రెస్మీట్లో మాట్లాడుతూ రైతు ప్రభాకర్ తనకు అన్యాయం జరుగుతున్నదని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకోకపోవడం వల్లనే ఓ నిండు ప్రాణం బలైందని పేర్కొన్నారు. రైతు తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు వెనుకడుగు వేయడంపై మండిపడ్డారు.
మధిర నియోజకవర్గానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నా డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క స్పందించకపోవడంపై జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భట్టి ఎమ్మెల్యేగా ఉండటం మధిర ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. భట్టి అనచరుల అరాచకాలతో అమాయక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు.