Congress | నిజామాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్కు చెందిన మడిగె ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన ఈ ఉదంతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. ఈ వ్యవహారం ఇటు పాలక పార్టీకి, అటు రిజిస్ట్రేషన్ శాఖకు మచ్చగా మారింది. ఒక ప్రబుద్ధుడు నకిలీ పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్ బుక్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన మడిగెను తన పేరిట మార్చుకున్న ఉదంతం బయటకు పొక్కకుండా స్థానిక కాంగ్రెస్ నేతలు పోలీస్ కమిషనర్కు, జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా అంతర్గతంగా విచారణ కొనసాగుతున్నది. రూ.అర కోటికిపైగా విలువ చేసే ఈ మడిగెను తిరిగి దక్కించుకుని పరువు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ముఖ్యులంతా ఇదే పని మీద ఉన్నారు.
చాలా ఏండ్లుగా నిజామాబాద్ నగరంలోని శంభుని గుడి వెనుకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ కార్యకలాపాల కోసం 75 గజాల విలువైన స్థలం ఉన్నది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి కిరాయి చెల్లిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ రైల్వేస్టేషన్ సమీపంలోని డీసీసీ ఆఫీసులోనే జరుగుతుండటంతో నాయకులు ఈ స్థలాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో అక్రమార్కులు ఎలాగైనా ఈ స్థలాన్ని కొట్టేయాలని స్కెచ్ వేశారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. మహ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి మహ్మద్ మాజిద్కు అమ్ముతున్నట్టుగా 2023 సెప్టెంబర్ 11న ఒప్పందం (అగ్రిమెంట్ ఆఫ్ సేల్) చేసుకున్నారు. అయితే, ఒప్పందంలో కీలకంగా ఉన్న యూసుఫ్ మరణించాడు.
ఏం జరిగిందో ఏమో కానీ పాషా, రిజ్వానాబేగం అనే మహిళ మహ్మద్ మాజిద్కు 43.65 గజాల స్థలాన్ని అమ్మినట్టు 2024 మే 6న రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రిజిస్ట్రేషన్ జరగడం విశేషం. కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్న ఈ స్థలానికి యూసుఫ్ ఎలా వారసుడిగా మారాడు? అతను చనిపోవడంతో రంగంలోకి మరికొంతమంది వ్యక్తులు ఎలా వచ్చారు? రికార్డులు సరి చూసుకోకుండానే సబ్ రిజిస్ట్రార్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వాస్తవానికి 2002 నుంచే 8-4-359/1 ఇంటి నెంబర్తో గల స్థలం కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్నది. అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకపోవడం, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరగడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేసింది.
పార్టీ స్థలం తాము అధికారంలో ఉన్నప్పుడే యథేచ్ఛగా అక్రమంగా రిజిస్ట్రేషన్ కావడంతో కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. వెంటనే పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూనకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ తతంగంలో దాగి ఉన్న వ్యక్తుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ బాదర్కు మెమో జారీ చేశారు.
నిజామాబాద్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలం వేరే వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారం మా దృష్టికొచ్చింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు కూ డా అందింది. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్కు మెమో జారీ చేశాం. విచారణ చేసి వాస్తవాలను వెలికి తీసిన తర్వాత తప్పు చేసి న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– ప్రసూన, నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్