హైదరాబాద్ : భవిష్యత్ లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్తో కలిసి మాట్లాడారు. నగరం లో అగ్ని ప్రమాదాల పై మంత్రి కేటీఆర్ నేతృత్వం లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం లో పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించామని వివరించారు.
అక్రమ కట్టడాలు , ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఓ ప్రత్యేక కమిటీ ని నియమించామని అన్నారు. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలిస్తుందని వెల్లడించారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తుందన్నారు.
రేపటి నుంచి నల్లగుట్ట భవనం కూల్చివేత
అగ్ని ప్రమాదం జరిగిన నల్ల గుట్ట భవనాన్ని కూల్చేందుకు టెండర్ పిలిచామని తలసాని తెలిపారు. రూ. 41 లక్షలకు టెండర్ ఖరారైందని , టెండర్ను దక్కించుకున్న సంస్థ రేపటి నుంచి కూల్చి వేత పనులను ప్రారంభిస్తుందని తెలిపారు. చిన్న పరిణామం లో ఉండే అగ్ని మాపక యంత్రాలను భవిష్యత్ లో వినియోగించేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. భవనాల్లో సామర్ధ్యానికి మించి వస్తువుల నిల్వ వల్ల అగ్ని ప్రమాదాల ఉధృతి పెరుగుతోందన్నారు. నల్ల గుట్ట అగ్ని ప్రమాదం లో మృతులకు రూ. 5లక్షలు పరిహారం అందిస్తున్నామన్నారు.
నిబంధనల మేరకే రిపబ్లిక్ వేడుకలు
రిపబ్లిక్ వేడుకలు నిబంధనల మేరకు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఇందులో రాజకీయం ఏమి లేదని అన్నారు. సీఎ కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేమిటీ? . ‘ మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చ’ని బండి సంజయ్ మోదీకి సలహా ఇవ్వచ్చని అన్నారు. ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీ కి అలవాటు గా మారిందని ఎద్దేవా చేశారు.