మంచాల, జూన్ 30 : రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ అడ్డంగా దొరికారు అవుట్ సోర్సింగ్ కంఫ్యూటర్ ఆపరేటర్ సురేశ్. ఇతనితోపాటు హైదరాబాద్ నగరంలోని మీసేవ నిర్వాహకుడు, మరో ఇద్దరితో కలిసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న విషయాన్ని తహసీల్దార్ బయటపెట్టారు. వివరాలు ఇలా.. మంచాల తహసీల్దార్ కార్యాలయంలో సురేశ్ నిరుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు.
హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉన్న మీసేవ నిర్వాహకుడైన రాజు, మరో ఇద్దరితో సురేశ్ కుమ్మక్కై స్థానికేతరులకు నకిలీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడ్డాడు. అందుకుగాను ఒక్కో సర్టిఫికెట్కు వెయ్యి నుంచి 5వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. వనస్థలిపురం మీసేవ కేంద్రం నుంచి ఒకే ఫోన్ నంబర్పై సర్టిఫికెట్లు జారీ కావడంపై తహసీల్దార్ ఆరాతీయగా ఈ బాగోతం బయటపడింది.
గత శనివారం నుంచి సురేశ్ సెలవు పెట్టి వెళ్లినట్టు తెలిసింది. మండలంలో 10 రోజులుగా 57 మందికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అక్రమంగా జారీ అయినట్టు గుర్తించారు. తహసీల్దార్ ఫిర్యాదుతో కంఫ్యూటర్ ఆపరేటర్ సురేశ్తోపాటు మీసేవ నిర్వాహకుడిపై మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తహసీల్దార్ తెలిపారు.