Sadarem | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఉద్దేశించిన సదరం సర్టిఫికెట్ల జారీ ఎంత దారుణంగా ఉన్నదో ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. సర్టిఫికెట్ల జారీలో క్షేత్రస్థాయి అధికారులు ఏమాత్రం పారదర్శకత పాటించడం లేదని తేటతెల్లమవుతున్నది.
మరోవైపు ఈ తప్పుడు సర్టిఫికెట్ల జారీతో అర్హులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని దివ్యాంగుల హక్కుల సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు, ఉన్నత విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇటీవలే దానిని 5 శాతానికి పెంచింది. అందుకోసం దివ్యాంగ అభ్యర్థులు సదరం (సాఫ్ట్వేర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ ఫర్ ఆక్సెస్ రిహాబిలిటేషన్, ఎంపవర్మెంట్) నుంచి వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుంది.
జిల్లా దవాఖానలు, బోధనా వైద్యశాలల్లో సంబంధిత విభాగంలోని వైద్య నిపుణులతో పరీక్షలను నిర్వహించి వైకల్యాన్ని నిర్ధారిస్తున్నారు. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో వైద్యులు సదరం సర్టిఫికెట్ల జారీలో నియమ నిబంధనలేమీ పాటించడంలేదని తెలుస్తున్నది. జిల్లాస్థాయిలోని వైద్యులు చేతివాటం ప్రదర్శిస్తూ అనర్హులకు సైతం వైకల్య నిర్ధారణ పత్రాలను జారీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగావకాశాల్లో నిజమైన అర్హులకు అవకాశాలు అందకుండా పోయి, తీవ్ర అన్యాయం వాటిల్లుతున్నది.
మెడికల్ బోర్డుల పరీక్షల్లో వెలుగులోకి..
తాజాగా చేపడుతున్న ఉద్యోగ భర్తీ ప్రక్రియలో సదరం సర్టిఫికెట్ల బాగోతం ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నది. ఉద్యోగ నియామకం సందర్భంగా దివ్యాంగ కోటా అభ్యర్థులకు సంబంధిత మెడికల్ బోర్డుల ద్వారా మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం పరిపాటి. సాధారణంగా హియరింగ్ హ్యాండీకాప్డ్ (హెచ్హెచ్) అభ్యర్థులకు కోఠి ఈఎన్టీ, విజువల్ హ్యాండీకాప్డ్ (వీహెచ్)కు సరోజినీ దవాఖాన, ఆర్థోపెడిక్ హ్యాండీకాప్డ్ (ఓహెచ్) వారి కోసం గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగానే అనేక మంది అభ్యర్థులు తిరస్కరణకు గురవుతున్నారు. సదరం సర్టిఫికెట్లలో 70-80 శాతం వైకల్యమున్నా, తాజాగా మెడికల్ బోర్డుల పరీక్షల్లో కనీస అర్హతకు గల వైకల్యం కూడా నిర్ధారణ కాలేకపోతున్నారంటే ఎంత ఇష్టారాజ్యంగా జారీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మరీ ముఖ్యంగా హెచ్హెచ్ క్యాటగిరీలో సగానికి పైగా సదరం సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవుతుండటం గమనార్హం.
ఆడియాలజిస్టుల కొరత
వివిధ జిల్లా దవాఖానల్లో ఆడియాలజిస్టులు లేక కొందరు ఈఎన్టీ వైద్యులే చేతివాటం ప్రదర్శిస్తూ తప్పుడు వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారని వికలాంగుల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి మాత్రమే మెడికల్ బోర్డులతో మరోసారి పరీక్షలను నిర్వహిస్తున్నారని, కానీ ఇతర ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇతర అంశాల్లో కేవలం సదరం సర్టిఫికెట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఫలితంగా తప్పుడు సదరం సర్టిఫికెట్ల జారీ వల్ల అర్హులకు నష్టం వాటిల్లుతున్నదని ఆ సంఘాల నేతలు వాదిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.