సరూర్నగర్కు చెందిన ఒక వ్యక్తి వయోభారంతో ఉన్న తన తల్లికి వ్యక్తిగత, వైద్యసేవలు అందించేందుకు ఒక వర్కర్ను నియమించుకోవాలనుకున్నాడు. జస్ట్ డయల్లో వచ్చిన సమాచారం మేరకు స్మార్ట్ ప్రో హోం హెల్త్కేర్ సర్వీస్ను ఆశ్రయించారు. కస్టమర్ నుంచి ముందుగానే నెలకు రూ.20-25వేల చొప్పున కొన్ని నెలల మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకున్న నిర్వాహకులు ఒక మహిళను కేటాయించారు. ఆమె రెండు నెలల పాటు సేవలు అందించి మానేసింది. ఇదేంటని అడిగితే.. నిర్వాహకులు తనకు రెండు నెలల జీతం ఇవ్వలేదని చెప్పింది. నిర్వాహకులను ప్రశ్నిస్తే మరో మహిళను కేటాయిస్తామని చెప్పి చేతులెత్తేశారు. పైసలైనా తిరిగి ఇవ్వాలని అడిగితే రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు.
జూబ్లీహిల్స్కు చెందిన ఒక వృద్ధ జంట బాగోగులు చూసేందుకు విదేశాల్లోని కుమారుడు ఇదేరీతిన ఒక సర్వీస్ సంస్థను ఆశ్రయించి, ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నాడు. ఆర్నెల్ల పాటు నమ్మకంగా పనిచేసినవాళ్లు.. ఆ ఇంట్లో ఎక్కడ? ఏం ఉన్నాయి? అన్న వివరాలు తెలుసుకున్నారు. ఒకరోజు రాత్రి వృద్ధ దంపతులను బెదిరించి కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకుపోయారు. తీరా సదరు సంస్థను ఆశ్రయిస్తే తమకూ ఆ విషయం తెలియదని, వారి పూర్తి వివరాలు తమవద్ద లేవని చేతులెత్తేశారు.
Home Service | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హోం సర్వీస్ అందించే సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో ఆ సంస్థల్లో జవాబుదారీతనం లోపించింది. పై రెండు ఘటనలే అందుకు సాక్ష్యం. హోం సర్వీస్ సంస్థలపై నిఘా, రికార్డుల నిర్వహణ లేకపోవటంతో సామాన్యుల అవసరాలతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి. హోం సర్వీస్ ఇస్తామంటూ ఒక్కో కస్టమర్ నుంచి మూడు, నాలుగు నెలల అడ్వాన్స్ తీసుకొని ఒకటి, రెండు నెలలకే చేతులెత్తేస్తున్నాయి. అటు వర్కర్కు ఇవ్వకుండా, ఇటు కస్టమర్కు డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాయి. ఒక్కో కస్టమర్కు రూ.10-20 వేల వరకు మోసం చేసినా, అంతా కలిపి లెక్కేస్తే రూ.కోట్లలో అవుతుంది. కస్టమర్లు పోలీసులను ఆశ్రయించినా చిన్న కేసు అంటూ పక్కనపడేస్తున్నారు.
అవసరాలే ఆసరాగా..
బిజీ జీవితంలో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తేగానీ ఆర్థికంగా కుటుంబాలు ముందుకుపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చాలా కుటుంబాల్లో వృద్ధుల బాగోగులు చూసుకోవటం సవాల్గా మారింది. కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నా, చాలామంది కన్నవారి రుణం తీర్చుకోవటం తమ కనీస బాధ్యతగా వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నారు. కొందరు వృద్ధులు అనారోగ్యం బారిన పడటంతో వారికి సమయానికి ఇన్సులిన్, ఇతరత్రా మందులు ఇవ్వటం, దినచర్యలు చేయించటం వంటి ప్రాథమిక వైద్య సాయం కోసం వర్కర్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు పిల్లలను చూసుకొనేందుకు ఆయాలను నియమించుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు.. రాష్ట్రంలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో అనేక కుటుంబాలు వర్కర్లను నియమించుకుంటున్నాయి. దీంతో గల్లీకో హోం సర్వీస్ సెంటర్ పుట్టుకొచ్చింది. ఈ సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు లేవు. అసలు ఏ శాఖ వద్ద వీరు అనుమతి తీసుకోవాలనేదానిపైనా అధికార యంత్రాంగం నుంచి స్పష్టత లేదు. దీంతో ఇష్టానుసారంగా ఈ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఒక గది తీసుకొని, ముందు బోర్డు తగిలించుకొని తాము హోం సర్వీస్ అందిస్తామంటూ ప్రకటించుకుంటున్నాయి.
కస్టమర్ల నుంచి ఆర్థిక దోపిడీ.. వర్కర్లతో శ్రమదోపిడీ
ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబాలకు చెందిన యువతులు, మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా ఈ హోం సర్వీస్ అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరిని హోం సర్వీస్ సంస్థలు నియమించుకొని.. అవసరం ఉన్నచోటుకు పంపిస్తున్నాయి. కొన్ని సంస్థలు గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొచ్చి హోం సర్వీసును అందిస్తున్నాయి. హోం సర్వీస్ కోసం ఒక కస్టమర్ నుంచి నెలకు రూ.20-25 వేల చొప్పున నాలుగైదు నెలల మొత్తాన్ని ముందుగానే అడ్వాన్సుగా తీసుకుంటున్న సంస్థలు.. వర్కర్కు మాత్రం రెండు నెలలైనా జీతం ఇవ్వటం లేదు. సాధారణంగా సంస్థ కమీషన్ పోగా వర్కర్కు రూ.10-15 వేలు చెల్లిస్తారు. అంటే ఒక్కో వర్కర్పై నెలకు రూ.10-15 వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ వర్కర్కు జీతం మాత్రం సరిగా ఇవ్వడం లేదు. దీంతో రెండు నెలల తర్వాత ఆ వర్కర్ అర్ధంతరంగా హోం సర్వీస్ నుంచి తప్పుకొని వేరే పని చూసుకుంటున్నారు. కస్టమర్లు నిలదీస్తే బోర్డు తిప్పేస్తున్నారు. మొత్తంగా ఒక్కో కస్టమర్ నుంచి దాదాపు రూ.80 వేలు జేబులో వేసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సీరియస్గా తీసుకోకపోవటంతో బోగస్ హోం సర్వీస్ సంస్థల ఇష్టారాజ్యం అవుతున్నది. ఒక్కో సంస్థ 50 మందిని మోసగించినా ఆ మొత్తం రూ.40 లక్షల వరకు అవుతుంది. ఒక్క హైదరాబాద్లోనే వందల సంస్థలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఆ మొత్తాన్ని లెక్కిస్తే కోట్లల్లో అవుతుంది. ఒక కస్టమర్ కోణంలో చూస్తే ఇది చిన్న మొత్తంగానే ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ దందా ఓ స్కాంలా తయారవుతున్నది. కొన్ని సంస్థలు నిజాయతీగానే సేవలు అందిస్తున్నా, లెక్కకు మించి సంస్థలు బోర్డు తిప్పేయటంతో బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
నేరాల కోణంలోనూ మరో సవాల్
బోగస్ హోం సర్వీస్ సంస్థల వ్యవహారం ఆర్థికంగానే కాకుండా సామాజికంగానూ సవాల్గా మారుతున్నది. కొందరు సంస్థల నిర్వాహకులు, వర్కర్లు కుమ్మక్కై లూటీలు చేస్తున్న అవకాశాలూ లేకపోలేదు. విదేశాల్లో ఉండే పిల్లలు తమ తల్లిదండ్రుల బాగోగుల కోసం వర్కర్లను నియమిస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉంటారు. ఓ ఆర్నెల్ల పాటు నమ్మకంగా పనిచేసే వర్కర్లు ఆపై వృద్ధులను మోసగించి, ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని ఉడాయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్వాహకులు తమది ప్రేక్షక పాత్రేనని నమ్మిస్తున్నారు. హోం సర్వీస్ సంస్థలు ముందుగా అనుమతి తీసుకోకపోవటం, తమ వద్ద పనిచేసే వర్కర్ల వివరాలను పక్కాగా నిర్వహించకపోవటం, వారి గురించి ముందుగా విచారణ చేయించకపోవటం.. ఇలా అనేక కోణాల్లో వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది. ఘటన జరిగిన తర్వాత విచారణ చేసినా పోలీసులు, నిర్వాహకుల వద్ద వర్కర్లకు సంబంధించిన పూర్తి వివరాలు లభించటం లేదు.
అధికారిక ప్లాట్ఫాం ఏర్పాటుతోనే మేలు హోం సర్వీస్ సంస్థల నమోదు, నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. సంస్థలు కచ్చితంగా సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవటంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో సంస్థ వివరాలు, అందులో పనిచేసే వర్కర్ల వివరాలను నమోదుచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. తద్వారా ఆర్థిక, సామాజిక కోణంలో ఏవైనా సమస్యలు వచ్చినపుడు పరిష్కారం సులువు అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా హోం సర్వీస్ సంస్థలపై పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత శాఖకు అప్పగిస్తే బోగస్ సంస్థల బండారం బయటపడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో హోం సర్వీస్ సంస్థల సేవలు కీలకంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ వ్యవస్థపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది.
మోసం జరిగితే ఫిర్యాదు చేయండి
హోం సర్వీస్ సంస్థలకు సంబంధించిన అనుమతులు, వాటి నిర్వహణపై పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదు. సంస్థలు మోసం చేసినా, సర్వీస్ పేరుతో పనిలోచేరేవాళ్లు ఏమైనా నేరాలు చేస్తే పోలీసులు ఆయా ఫిర్యాదులపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తుంటారు. మోసాలు, జరిగే నేరాలపై బాధితులు పోలీసులను ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. మోసం జరిగిన తర్వాత కేసు నమోదు చేయడం కంటే, ఇలాంటి సర్వీస్ సంస్థలు ఏర్పాటు చేసే వారు తప్పని సరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సంక్షేమశాఖ దీనిపై తగిన చర్యలు తీసుకొని నియమ నిబంధనలు పెడితే బాగుంటుంది.
– అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీ