హైదరాబాద్ రియల్ రంగం కళ తప్పిందా? బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటేనే జంకుతున్నారా? అన్రాక్ సంస్థ తాజా సర్వే నిజమేనని స్పష్టంచేస్తున్నది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభమై ఇండ్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుంటే.. నగరంలో ఇండ్లు అమ్ముడుపోక బిల్డర్లు, రియల్టర్లు తలపట్టుకుంటున్నట్టు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య జరిగిన అమ్మకాలతో పోల్చితే ఏప్రిల్-జూన్ మధ్య అమ్మకాలు ఏకంగా 23 శాతం తగ్గినట్టుగా అన్రాక్ నివేదిక బయటపెట్టింది. నగరంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లోనూ ఏకంగా 40 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించింది.
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 28 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కీలకమైన మెట్రో నగరాల్లో రియల్, నిర్మాణ రంగాలపై ఆర్నెల్లు, సంవత్సరానికి ఒకసారి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశోధన చేసి ఆ సర్వే వివరాలను తమ నివేదికల్లో వెల్లడిస్తాయి. గత ఏడాది వరకు దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ రియల్ రంగం చాలా ఊపు మీదుందనే సర్వేలు అనేకం వ చ్చాయి. ఆల్టైం రికార్డులు నమోదు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ విషయంలోనైతే బెంగళూరు వంటి సిలికాన్ వ్యాలీని కూడా వెనక్కినెట్టి హైదరాబాద్ నగర మార్కె ట్ గణనీయమైన వృద్ధి అంకెలను నమోదు చే సింది.
తాజాగా 2024 సంవత్సరంలో మొ దటి, రెండు త్రైమాసికాలపై అన్రాక్ సంస్థ పరిశోధన చేసి తన నివేదికను వెల్లడించింది. దేశం లో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణె, బెంగళూరు, చెన్నై… ఇలా ఏడు న గరాల్లో నివాస గృహాల విక్రయంపై వివరాలు సేకరించింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో ఏడు నగరాల్లో మొదటి మూడు నెలలు (జనవరి-మార్చి) 1.11 లక్షల యూనిట్లు ప్రారం భమయ్యాయి. అదే రెండో త్రైమాసికం(మార్చి-జూన్)లో 1.17 లక్షల యూనిట్లు ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఆరు శాతం పెరుగుదల నమోదైంది. కానీ హైదరాబాద్లో మాత్రం కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అంటేనే బిల్డర్లు జంకే పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 22,960 నివాస గృహాల నిర్మాణం జరిగితే, రెండో త్రైమాసికంలో 13,750యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఏకంగా 40 శాతం తగ్గుదల నమోదైంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో ఢిల్లీ 134 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ఇక్కడ మొదటి మూడు నెలల్లో కేవలం 7,270 యూనిట్లు మొదలైతే, రెండో త్రైమాసికంలో 17,030 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ముంబైలో నూ 31 శాతం పెరుగుదల నమోదైంది. బెంగళూరులో కొత్త ప్రాజెక్టులు పెరగకపోయినా ఒక్క శాతం మాత్రమే తగ్గుదల నమోదైంది.
హైదరాబాద్ మహానగరంలో ఇండ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 19,660 ఇండ్లు అమ్ముడుపోగా..రెండో త్రైమాసికంలో 15,085 ఇండ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మొదటి మూడు నెలలతో పోలిస్తే ఇండ్ల అమ్మకాలు 23 శాతం తగ్గిపోయాయి. దేశంలో ఢిల్లీ మినహా ఇతర మెట్రోనగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా, హైదరాబాద్లో ఉన్నంత రియల్ ఢమాల్ ఇతర నగరాల్లో లేదు. కోల్కతాలో 18 శాతం తగ్గుదల ఉంటే… బెంగళూరు, పుణెల్లోఎనిమిది, ముంబైలో మూడు, చెన్నైలో తొమ్మిది శాతం మేర ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. ఇండ్ల అమ్మకాలు పడిపోవడంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది.
వాస్తవానికి హైదరాబాద్ మహానగరంలో రియల్ రంగంలో క్షీణత అనేది ఆర్నెల్లుగానే ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. కాకపోతే గతంలో చేసుకున్న అగ్రిమెంట్ల మే రకు గత ఆర్నెల్లలో అమ్మకాల ప్రక్రియను పూ ర్తి చేసినట్టు తెలిపారు. సాధారణంగా నివాస గృహాల కొనుగోలులో ముందు కొంత (1/4) మొత్తాన్ని ఇచ్చి అగ్రిమెంటు చేసుకుంటారు. తర్వాత 45 రోజుల నుంచి మూడు నెలల వర కు ఆయా యూనిట్ మొత్తాన్ని బట్టి గడువు ఉంటుంది. ఇలా గతంలో చేసుకున్న అగ్రిమెం ట్ల మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తున్నది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అమ్మకాలు పడిపోయి అగ్రిమెంట్లు కూడా తగ్గిపోవడంతో ఆ ప్రభావం రెండో త్రైమాసికంపై పడినట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవమనేదే చాలా మేరకు తగ్గినందున, గడిచిన మూడు నెలల్లో అగ్రిమెంట్లు కూడా భారీస్థాయిలో తగ్గాయని, ఆ ప్రభావం అనేది రానున్న నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పరిశీలించినా ఇవే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నమోదైన ఆదాయ వివరాలను పరిశీలిస్తే… ఫిబ్రవరిలో రూ.800.40 కోట్లు, మార్చిలో రూ.771.17 కోట్లు, ఏప్రిల్లో రూ.719.98 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగానూ 33 జిల్లాల్లో ఫిబ్రవరిలో రూ.1061.70 కోట్లు, మార్చిలో రూ.1031.57 కోట్ల ఆదాయం నమోదు కాగా… ఏప్రిల్లో రూ.934.81 కోట్ల ఆదాయం వచ్చింది.
రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన నాటి నుంచి నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై నమ్మకం రాకపోవడం ఒక కారణంగా ఉంది. దీంతో పాటు కొనుగోలు దారులు రియల్ మార్కెట్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అందువల్లే కొనుగోళ్లు తగ్గాయని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలను బట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఊపు వస్తుంది.
– ఆర్ వర్మ, బిల్డర్, కూకట్పల్లి
కొత్త ప్రభుత్వానికి నగరాభివృద్ధిపై ఒక స్థిరమైన పాలసీ లేదు. కీలకమైన ఎయిర్పోర్టు మెట్రోను, ఫార్మా సిటీని రద్దు చేసింది. 6 నెలలుగా పురపాలక శాఖ సీఎం వద్దే ఉన్నా, భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులే ఇవ్వలేదు. ఎన్నికల నుంచే రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదిగా ఉంటే… ఇప్పుడు కొత్తగా భూముల ధరలు పెంచుతామని ప్రభు త్వం ప్రకటించడమంటే కొనుగోలుదారులపై మరింత భారాన్ని మోపడమే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లలో ఒకసారి భూముల ధరలను పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తుండానే భూముల ధరలు పెంచేస్తోంది. దీని ప్రభావం కొనుగోళ్లపై ఉంటుంది.
– జక్క వెంకటరెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారు, మేయర్, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్