హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అన్నివర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పేర్కొన్నారు. రోజులానే గురువారం కూడా కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యుత్తు, సాగు, తాగునీరు, వ్యవసాయం వంటి రంగాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశచరిత్రలోనే మునుపెన్నడూ లేవని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని గుర్తుచేశారు. ‘అబ్కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతో దేశంలో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్తో కలిసి అడుగులేస్తూ ముందుకు సాగిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని తెలిపారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతోపాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు.
నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. రైతులపై లాఠీచార్జీ చేసి, కాల్పులు జరిపి 700 మంది రైతుల మరణానికి నాటి బీజేపీ ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు. దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ పార్టీ ‘కిసాన్ సరార్’ నినాదంతో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగిందని వివరించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల నుంచి అపూర్వస్పందన వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతికోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని తెలిపారు. అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదు. మనకు ప్రజాతీర్పే శిరోధార్యం. వారు ఎటువంటి పాత్ర అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని అవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే పార్టీ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు ఉద్బోధించారు. కార్యక్రమం లో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు సమాచారం లేకుండా తనను కలిసేందుకు రావొద్దని, వచ్చే ముందు సమాచారం లేదా అనుమతి తీసుకోవాలని ఎర్రవెల్లి వస్తున్న అభిమానులు, కార్యకర్తలకు కేసీఆర్ మరోమారు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పేర్లను పార్టీ ముందస్తుగా ప్రకటిస్తుందని, అలా ప్రకటించిన ప్రాంతాల వారే తమ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తనను కలవడానికి రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎంత చెప్పినా వినకుండా ఎర్రవెల్లి నివాసానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీజలాల వాటాను సాధించుకోవటంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకుల స్వార్థంతోపాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి, సోయిలేనితనమే ప్రధాన కారణాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఫలితంగా తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టం వాటిల్లిందని చెప్పారు. గురువారం ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ను ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మె ల్సీ గోరటి వెంకన్న మర్యాదపూర్వంగా కలిశారు. తన సాహితీ సృజనను కేసీఆర్కు అందజేశారు. అ నంతరం సాగిన ఇష్టాగోష్టిలో తెలంగాణ సాహి త్యం, సంస్కృతి, రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ విద్యుత్తు, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్యరాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని వెల్లడించారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితిలోంచి తెలంగాణ సమస్యలను అర్థం చేసుకొని కవులు, కళాకారులు, మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు, బీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని వివరించారు. గత నష్టాలను సరిదిద్దుకుంటూ తెలంగాణ అస్థిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికే ఆదర్శవంతమైన ప్రగతిని అందించామని తెలిపారు.
ప్రపంచ నాయకత్వానికి దీటుగా శాంతియుత పద్ధతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందని గోరటి వెంకన్న అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన దేశానికే ఆదర్శంగా సాగిందని చెప్పారు. గోరటి వెంకన్నతోపాటు సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన ‘పిట్టవాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. జర్నలిస్టు వెంకన్నను కేసీఆర్ అభినందించారు. ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, పార్టీ నేత విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.