హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్కు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశాలపై చట్టం ప్రకారం విశ్వసనీయ వ్యక్తులతో కమిషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలకు అధికారం ఉన్నదని తెలిపింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై న్యాయపరమైన వ్యవస్థలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చిన అంశాలపై విచారణ జరిపే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేదన్న మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఈఆర్సీల పరిధికంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పరిధి విస్తృతమని తెలిపింది.
కాబట్టి ఈఆర్సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి కమిషన్కు లేదన్న వాదనతో ఏకీభవించలేమని పేరొంది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంతో ఉన్నారనడానికి కేవలం మీడియా సమావేశంలో చేసిన ప్రకటన తప్ప ఇతర ఆధారాలను కేసీఆర్ చూపలేదని పేర్కొంది. నరసింహారెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం మార్చి 14న ఇచ్చిన జీవో 9ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన బెంచ్ విచారణ జరిపింది. అనంతరం సోమవారం 22 పేజీల తీర్పును వెలువరించింది.
కమిషన్ ఏర్పాటు చేయవచ్చు
విచారణ కమిషన్ల చట్టం- 1952 కింద కొన్ని అధికారాలతో ప్రభుత్వాలు కమిషన్ను ఏర్పాటు చేయవచ్చని, ఈ చట్టం కింద వాస్తవ నిర్ధారణ కమిషన్ మాత్రమే ఏర్పాటవుతుందని హైకోర్టు పేరొంది. నివేదిక సమర్పించడం వరకే కమిషన్ల బాధ్యత అని, దాన్ని అమలుచేయాలని కోరే అధికారం లేదని తెలిపింది. ప్రజాప్రయోజనాలకు చెందిన సున్నితమైన అంశాలను సాధారణ దర్యాప్తు సంస్థలకు అప్పగించిన పక్షంలో అనుమానాలు తలెత్తే అవకాశం ఉన్నందున కమిషన్తో విచారణ చేయించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని గుర్తుచేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య 2015 సెప్టెంబర్ 22న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగిందని, దీనిపై పలువురు ఎస్ఈఆర్సీని ఆశ్రయించగా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి యూనిట్ రూ.3.90గా నిర్ణయిస్తూ 2017 మార్చి 31న ఉత్తర్వులు జారీచేసిందని తెలిపింది.
ఛత్తీస్గఢ్ ఈఆర్సీ 2018 జులై 7న టారిఫ్ నిమిత్తం ప్రాజెక్టు ఖర్చును నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా తెలంగాణ విద్యుత్తు సంస్థలు అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయని పేర్కొంది. పిటిషన్లోని అంశాల ప్రకారం.. ప్రాజెక్టు ఖర్చు, టారిఫ్ నిర్ణయాలపై మాత్రమే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఎస్ఈఆర్సీలు విచారణ జరిపినట్టు తేలుతున్నదని పేరొంది. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు విధివిధానాలను పరిశీలిస్తే ఈ వ్యవహారాలపై నిర్ణయాల్లోని లోపాలు, అవి చూపే ఆర్థిక ప్రభావంపై కూడా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపింది. ఈఆర్సీలు తేల్చిన అంశాలకంటే విస్తృతమైనవి, ఆ కమిషన్లు తేల్చిన అంశాలను ఇందులో చేర్చలేదని పేరొంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీలు తేల్చిన అంశాలపై విచారించే పరిధి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేదన్న వాదనను తిరసరిసున్నట్లు తెలిపింది.
పక్షపాతానికి ఆధారాల్లేవు
కేసీఆర్ పిటిషన్పై కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డికి నోటీసు జారీ చేసేముందు పక్షపాతంతో వ్యవహరించారన్న ఆరోపణపై ప్రాథమికంగా ఈ కోర్టు సంతృప్తి చెందాల్సి ఉన్నదని ధర్మాసనం పేరొంది. జూన్ 11న నరసింహారెడ్డి తమ కమిషన్ విచారణ స్థితిని వివరించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారని, ముందుగానే పక్షపాతంతో ఓ నిర్ణయానికి వచ్చేశారని కేసీఆర్ ఆరోపించారని తెలిపింది. ‘తన ముందున్న సమాచారం ఆధారంగా కమిషన్ వాస్తవాలను నమోదు చేయాలని, అంతేగాకుండా కమిషన్కు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగ విధులు నిర్వహించారన్న విషయాన్ని విస్మరించలేమని వ్యాఖ్యానించింది.. విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటన ఇచ్చారన్న కారణం తప్ప వేరే సమాచారం లేదని, పక్షపాతమని ఊహించి చెప్పరాదని, దాన్ని నిరూపించాల్సి ఉందని పేరొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్పై విచారించడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తీర్పును వెలువరించింది.
విద్యుత్తు విచారణ సంఘం గడువు పొడిగింపు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుతోపాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్లపై నిర్మాణపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30తో ముగిసిన ఈ కమిషన్ గడువును నెల రోజుల పాటు పొడగించాలని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ విచారణ సంఘం గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.