Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ‘మళ్లీ పెరిగిన కడుపు కోతలు‘ కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని.. అందుకు అవసరమైన అవగాహనను గర్భిణులకు కల్పించాలని అధికారులకు సూచించారు. సిజేరియన్ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివిధ జిల్లాల్లో ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సాధారణ డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలంటే సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరించి.. అందుకు అవసరమైన అవగాహన కల్పించి సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని కోరారు.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని అధికారులను అదేశించారు.