CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఫారసులకు కాంగ్రెస్ అధిష్ఠానం బ్రేక్ వేస్తున్నదా? ఆయన వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నదా? ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా? ఈ పరిణామాలతో ఆయనలో అభద్రతాభావం పెరిగిపోయిందా? పార్టీపై, ప్రభుత్వంపై మొన్నటి దాకా ఆయనకున్న పట్టుసడలిపోతున్నదా? అంటే, అవుననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి మార్పు తదితర అంశాలను గమనిస్తే, సీఎం రేవంత్రెడ్డికి అధిష్ఠానం చెక్ పెడుతున్నదేమోనన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తంచేసిన అధిష్ఠానం.. ముఖ్యమంత్రి, మంత్రులు ‘నువ్వా-నేనా?’ అనే తరహాలో వ్యవహరిస్తుండటాన్నీ సీరియస్గా తీసుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఎన్నికల
తరువాత అన్న విధంగా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నామినేటెడ్ పోస్టులు
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి సరిగ్గా ఒకరోజు ముందు 37 నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆ మరుసటిరోజే ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో కోడ్ ముగిశాకే నామినేటెడ్ పోస్టులకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసి మూడు వారాలు గడిచినప్పటికీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాలేదు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ఈ జాబితాను అధిష్ఠానం పునః సమీక్షిస్తున్నట్టు తెలిసింది. ప్రకటించిన నామినేటెడ్ పోస్టులకు ఉత్తర్వులు జారీ కాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ అడ్డుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రేవంత్రెడ్డి సిఫారసు మేరకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్నది అధిష్ఠానం తాజా అభిప్రాయమన్నది ఈ వర్గాల సమాచారం. గతంలో ప్రకటించిన 37 పోస్టులతోపాటు మరో 15-20 నామినేటెడ్ పోస్టుల జాబితాను ఈసారి తాజాగా దీపాదాస్మున్షీతో కలిసి కసరత్తు చేసినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు ఎంపిక బాధ్యతను రేవంత్రెడ్డికి ఒక్కరికే అప్పగించకుండా తాజా జాబితాను పార్టీ పరిశీలకురాలితో కలిసి ఖరారు చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం.
విస్తరణ, పీసీసీ అధినేత ఎంపికలోనూ అధిష్ఠానం మార్క్?
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుని ఎంపికలోనూ అధిష్ఠానం తన మార్క్ చూపించబోతున్నదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీపై, ప్రభుత్వంపై తన ఆధిపత్యానికి ఢోకా లేకుండా మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపిక జరగాలని సీఎం రేవంత్ యోచిస్తుండగా, అధిష్ఠానం మాత్రం పార్టీ, ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన మార్క్ను మంత్రివర్గ విస్తరణలో, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కనబర్చబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏతావాతా ఈ పరిణామాలన్నీ అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్రెడ్డి పరపతి తగ్గిందనడానికి నిదర్శనంగా సీనియర్ నాయకుడు ఒకరు విశ్లేషించారు. సీఎం రేవంత్రెడ్డి పట్ల అధిష్ఠానంలో వచ్చిన మార్పును మంత్రులు, సీనియర్ నేతలు పసిగట్టాకే, వారు నేరుగా పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారాన్ని చేరవేస్తూ చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని అధిష్ఠానం ప్రోత్సహిస్తున్నదన్న అనుమానాన్ని సీఎం సన్నిహితవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల కొందరు మంత్రులు సీఎంకు సమాచారం లేకుండానే రహస్యంగా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చినట్టు ఈ వర్గాలు చెప్తున్నాయి. మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కాకుండా సీఎం రేవంత్రెడ్డి, పూర్వాశ్రమంలో తనతో కలిసి టీడీపీలో ఉన్న వారికే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించడాన్ని సీనియర్ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి, పట్నం మహేందర్రెడ్డి, తాజాగా పోచారం శ్రీనివాస్రెడ్డి తదితర ముఖ్య నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇచ్చే బాధ్యతను సీఎం రేవంత్రెడ్డి ఇద్దరు మంత్రులకు అప్పగించడం పలువురు సీనియర్ మంత్రులకు మింగుడుపడటం లేదన్న ప్రచారం జరుగుతున్నది.
పార్లమెంట్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కాకుండా పేలవమైన ఫలితాలు రావడం అధిష్ఠానాన్ని నిరాశపరిచింది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో 14 సీట్లు టార్గెట్గా పెట్టుకొని కనీసం 12 సీట్లు సాధించాలని రేవంత్రెడ్డికి అధిష్ఠానం టార్గెట్ విధించింది. కానీ, ఎనిమిది ఎంపీ సీట్లతోనే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితం కావడం పట్ల అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ నుంచి నివేదిక కోరింది.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఏకం కావడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని ఆమె నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఫలితాల అనంతరం సీఎం రేవంత్రెడ్డి కూడా ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీపాదాస్మున్షీ పంపిన నివేదికలో సైతం రేవంత్రెడ్డి చేసిన వాదనే ఉండటంతో అధిష్ఠానం సంతృప్తి చెందలేదని తెలుస్తున్నది. ఇతర మార్గాల ద్వారా అధిష్ఠానం సేకరించిన నివేదికలో మరోరకమైన అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో రేవంత్రెడ్డి చేసిన తప్పిదాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా వ్యవహరించిన మంత్రులకు ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడం వంటివి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణమని తేలినట్టు సమాచారం. దీంతో నిజనిర్ధారణకు ఏఐసీసీ తిరిగి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయంతో అధిష్ఠానం ఏకీభవించలేదనడానికి ఈ పరిణామమే నిదర్శనమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.