సిద్దిపేట : సర్పంచులు(Sarpanchs), ఎంపీటీసీల హయాంలోనే సాగు నీటి కల సాకారమైంది. చరిత్రలో నిలిచే ఎన్నో పనులు చేసిన ఘనత మీకే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సోమవా రం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ చివరి సర్వ సభ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లా డారు. పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ఎల్లప్పుడూ ఉంటుం దన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు (Representatives of local bodies) ఐదు సంవత్సరాలుగా కష్టపడి ప్రజలకు సేవలందించారని ప్రశంసిం చారు.
సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి చాలా గ్రామాల్లో సమన్వయంతో పని చేశారు. కాళేశ్వరం నీళ్లను రైతులకు రెండు పంటలకు అందించిన గొప్ప అవకాశం మీ హయాంలో మీకు దొరికిందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటాం. కానీ, జీవన గతిని, పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేది సాగు నీరు మాత్రమేనని చెప్పారు. అలాంటి సాగునీరు మీ ఈ అయిదేళ్ల కాలంలో రైతులకు అందడం మీ అదృష్టమని చెప్పారు. గ్రామాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలు బాగుచేసుకున్నాం.
అదేవిధంగా సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఇలా అనేక అభివృద్ధి పనులు మీ హయాంలో చేసుకున్నామని తెలిపారు. పదవుల్లో ఉన్నపుడు ఎన్ని మంచి పనులు చేశామనేదే శాశ్వతంగా నిలిచిపోతుంది. కావున మీకు మళ్లీ ఇంకా మంచి అవకాశాలు రావాలని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఆకాంక్షించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందే. అధికారంలో ఉన్నా లేకపోయినా నా సహకారం ఎప్పడికి మీకు ఉంటుందని భరోసానిచ్చారు.