రాజన్న సిరిసిల్ల, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై.. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోతుండగా.. నేతన్నలు బలవన్మరణాల బాట పడుతున్నారు. తాజాగా బుధవారం మరమగ్గాల అనుబంధ పరిశ్రమైన సైజింగ్లు నడవక ఓ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరి (46)కి భార్య మంజుల, కూతుళ్లు లహరి, నిహారిక ఉన్నారు. మూడేండ్ల క్రితం పెద్ద కూతురి వివాహం చేశాడు. చిన్న కూతురు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కొన్నేండ్లుగా సైజింగ్లో బీములు నింపే పనిచేస్తున్న ఆయనకు కొద్దిరోజులుగా పనికరువైంది. ఓ వైపు పనిలేక.. మరోవైపు కూతురి పెండ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భార్య మంజుల పుట్టింటికి వెళ్లిపోవడంతో యాదగిరి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. విషయం తెలియడంతో భార్య ఇంటికి చేరుకొని గుండెలవిసేలా రోదించింది. ఉపాధి దెబ్బతినడం వల్లే తన భర్త చనిపోయాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు కల్పించిన బీమాలో యాదగిరి పేరు నమోదు చేసుకున్నట్టు చేనేత జౌళీశాఖ అధికారులు తెలిపారు.