Telangana | పెండింగ్లో ఉన్న రెండువేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మతల్లిగుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీభవన్కు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోకాలిపై కూర్చున్నా మొర ఆలకించరా?
సోకాల్డ్ ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదు. సీఎం ఇంటి ముం దు మోకాళ్లపై కూర్చొని అభ్యర్థించినా వారి మొర ఆలకించడం లేదు. మేం విద్యా ప్రమాణాలు పెంచేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. -హరీశ్రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న రెండువేల పోస్టులను బ్యాక్లాగ్ చేయకుండా భర్తీ చేయాలని కోరుతూ అభ్యర్థులు బుధవారం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మోకాళ్ల మీద కూర్చొని నినాదాలు చేశారు. పోస్టుల భర్తీలో తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా కొందరు జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద భిక్షాటన చేశారు.
మహిళా అభ్యర్థులు కొంగుపట్టి తమ కు న్యాయం చేయాలని అర్థించారు. ప్రభుత్వ మొండి వైఖరితో తమకు తీవ్ర నష్టం జరుగుతున్నదని, డౌన్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో వారు ఆయన ఫ్లెక్సీకి వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యమంత్రితో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులుం ప్రదర్శించారు. గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేసేందు కు వచ్చిన మీడియా ప్రతినిధులను అడ్డుకోవడంతోపాటు వారిని అక్కడి నుంచి గెంటివేశారు. ఆందోళనకారులు అక్కడి నుంచి నేరు గా గాంధీభవన్ చేరుకుని వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
2500కు పైగా పోస్టులు బ్యాక్లాగ్?
గురుకులాల్లో 9,210 టీచర్ పోస్టుల భర్తీకి గత కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఉన్నత హోదా నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీల ప్రక్రియను కింది నుంచి పైస్థాయికి చేపట్టడంతో ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యాడు. దీంతో 2,500పైగా పోస్టులు మిగిలిపోయా యి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ఈ విధానంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులకు నష్టం వాటిల్లింది. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్… అధికారం చేపట్టిన తర్వాత గందరగోళంగా భర్తీ ప్రక్రియ చేపట్టి నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేస్తున్నదని వారు వాపోతున్నారు.
హామీలు నీటిమూటలు
డిమాండ్ 1: జాబ్ క్యాలెండర్
కాంగ్రెస్ హామీ: ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
ఆరు నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడ లేదని నిరుద్యోగుల ఆవేదన
డిమాండ్ 2: పోస్టుల పెంపు
కాంగ్రెస్ హామీ: గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంచుతాం.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే ఒక్క పోస్టూ పెంచలేదంటున్న అభ్యర్థులు
డిమాండ్ 3: గ్రూప్-1 మెయిన్స్
కాంగ్రెస్ హామీ:ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తాం.
మళ్లీ 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తున్నదని, అసెంబ్లీలో అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు
డిమాండ్ 4: మెగా డీఎస్సీ
కాంగ్రెస్ హామీ: 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
11 వేల పోస్టులతోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేశారని, అందులోనూ కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే 5 వేల పోస్టులు
ఉన్నాయని నిరుద్యోగుల ఆవేదన
డిమాండ్ 5: జీవో – 46
కాంగ్రెస్ హామీ: జీవో – 46ను రద్దు చేస్తాం.
జీవో-46తో గ్రామీణ ప్రాంతాల యువతకు అన్యా యం జరుగుతున్నదని అభ్యర్థుల మొర. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమయ్యిందని ప్రశ్న.
డిమాండ్ 6: జేఎల్ ఫలితాలు
జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్-4 పోస్టులు భర్తీ చేస్తే, జేఎల్ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్-4 పోస్టులు ఖాళీ అవుతాయని చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగుల ఆవేదన.