Rythu Runamafi | రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని.. కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని పేర్కొన్నారు. పాస్ బుక్ ఆధారంగానే రుణ మాఫీ ఉంటుందని తెలిపారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని వెల్లడించారు.
పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి తప్ప…. బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని.. పంపిణీలో మాత్రమే అంతరాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేసరికి ప్రతి ఏడాది జరిగే నిర్వహణ పనులు జరగడం వల్లే అంతరాయం ఏర్పడిందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పానని అన్నారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలకు మించి బడ్జెట్ ఉండకూడని అధికారులకు అదేశాలిచ్చానన్నారు.
మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తామన్నారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని.. కొత్త వారిని నియమించిన తర్వాత కుల గణన చేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించామని తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులను ఒకసారి కలిశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.