Congress | వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది. ఓ వర్గానికి మంత్రి సీతక్క నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఇంకో మంత్రి కొండా సురేఖ నాయకత్వం వహిస్తున్నట్టు నాయకుల్లో చర్చ జరుగుతున్నది. సీతక్క వెంట స్టేషన్ ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు ఉండగా.. కొండా సురేఖ వెంట వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని ఉన్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. సీఎం ప్రోగ్రాం ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సమీక్ష జరిగింది. మరో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం , రేవూరి, రాజేందర్రెడ్డి, నాగరాజుతోపాటు రెండు జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం నుంచి సీతక్క మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాశ్రెడ్డి బయటకు వచ్చారు. మంత్రి సురేఖ ఆహ్వానించినా ఆగకుండా సీతక్క, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి ప్రకాశ్రెడ్డి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కొండా సురేఖ, సీతక్కలకు మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మేడారం జాతర, లోక్సభ ఎన్నికల ఇన్చార్జి, నామినేటెడ్ పోస్టుల కేటాయింపు విషయాల్లో మంత్రుల మధ్య విభేదాలు పొడసూపినట్టు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సీతక్క వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడంలేదు.
మేడారం జాతర ఏర్పాట్లు పూర్తిగా సీతక్క ఆధ్వర్యంలోనే జరగడంతో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ అసంతృప్తితో ఒక్కరోజే వెళ్లి వచ్చారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి సురేఖకు కాకుండా రేవూరి ప్రకాశ్రెడ్డికి అప్పగిచ్చింది. వరంగల్లోని ధార్మిక భవన్ కేటాయింపుపైనా భేదాభిప్రాయాలు వచ్చినట్టు చెప్తున్నారు. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు ప్రాధాన్య విషయమై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి, మంత్రి సురేఖకు మధ్య ఫోన్లో జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి మంత్రి సురేఖకు, ఎమ్మెల్యే రేవూరికి మధ్య విభేదాలు భగ్గుమన్నట్టు కాం గ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కీలక ప్రజాప్రతినిధులు ఎవరికి వారుగా గ్రూపులు కట్టి ఆధిపత్య పోరు చెలాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.