హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మంగళవారం సీఎం రేవంత్కు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఎక్కువ మంది నిరుద్యోగులు డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు కొన్నేండ్లుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని, నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున, వాటి సంఖ్యను పెంచితే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టుగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు గ్రూప్ -2 ఎక్సైజ్ ఎస్సై ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. టెట్ ఫలితాలను నార్మలైజేషన్ విధానం చేయాలని, డీఎస్సీ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని సీఎంను కోరారు.